Kerala Shocker: మతం మారాలంటూ చెల్లి, బావపై దాడి, పెళ్లైన మూడురోజులకే నవదంపతులను చంపేయత్నం, కేరళలో దారుణ ఘటన
Representational Image | (Photo Credits: PTI)

Thiruvananthapuram, November 4: కేరళలో దారుణం జరిగింది. మతం మారేందుకు నిరాకరించాడని బావపై దాడి చేశాడు బావమరిది. పెళ్లైన మూడు రోజులకే ఈ ఘటన జరిగింది.

షెడ్యూల్ కులానికి చెందిన మిథున్ కృష్ణన్‌ అనే వ్యక్తి అక్టోబర్ 29న అదే గ్రామానికి చెందిన దీప్తి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు కేసు నమోదు చేసుకున్నాయి. అయితే ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో ఒప్పుకున్న దీప్తి కుటుంబ సభ్యులు మూడు రోజుల తర్వాత మరోసారి గొడవకు దిగారు.

దంపతులిద్దరూ క్రిష్టియన్ పద్దతిలో వివాహం చేసుకునేందుకు చర్చికి రావాలని కోరారు. అయితే దీప్తి, మిథున్ చర్చికి వెళ్లిన తర్వాత అక్కడ సీన్ రివర్స్ అయింది. మిథున్‌ను క్రిస్ట్రియానికీ మారాలంటూ దీప్తి సోదరుడు డానిష్ ఒత్తిడి చేశాడు. దానికి ఒప్పుకోకపోవడంతో, తన సోదరికి విడిచిపెట్టాలని బెదిరించాడు. కావాలంటే  డబ్బు ఇస్తానని, లేకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. అయితే డానిష్ మాటలను వినలేదు మిథున్.

ఆ తర్వాత కొద్దిసేపటికే దీప్తి తల్లిని చూసేందుకు దంపతులు వెళ్లడంతో అక్కడే వారిపై దాడి చేశాడు డానిష్. విచక్షణారహితంగా వారిని కొట్టారు. దీంతో దంపతుల మెడ, వెన్నెముకకు తీవ్రంగా గాయాలయ్యాయి.

ఈ ఘటనపై తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు రాజీయత్నాలు మొదలు పెట్టారని బాధితులు ఆరోపించారు. కానీ చివరికీ నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.