Nirbhaya Case: నిర్భయ దోషులకు వారం రోజులు గడువు విధించిన దిల్లీ హైకోర్ట్, ఆ లోపే న్యాయపరమైన అవకాశాలు ముగించుకోవాలి, ఆ తర్వాత ఉరితీత అమలుపై విచారణ
Nirbhaya case convicts | File Image

New Delhi, February 5: ఉరిశిక్షను తప్పించుకునేందుకు న్యాయవ్యస్థలోని లొసుగులన్నీ నిర్భయ దోషులు (Nirbhaya Case Convicts) తమకు అనుకూలంగా మార్చుకుంటున్న నేపథ్యంలో దిల్లీ హైకోర్ట్  (Delhi High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నలుగురు దోషులకు వారం రోజుల గడువు విధించింది. ఒక వారంలో తమకున్న చట్టపరమైన అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాలని తీర్పునిచ్చింది. ఆ తరువాత వారి ఉరిశిక్ష అమలుపై (Execution) ట్రయల్ కోర్టు తదుపరి విచారణలు ప్రారంభిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అదే సమయంలో ఈ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషులను విడివిడిగా ఉరి తీయడానికి దిల్లీ హైకోర్ట్ అనుమతిని నిరాకరించింది. ఈ క్రమంలో నిర్భయ దోషులను వేరువేరుగా ఉరితీసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

Check ANI update:

"ఒకే కేసులో ఒకే రకమైన శిక్షపడినపుడు అందులోనిఒక దోషి యొక్క క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నపుడు, ఆ దోషి మినహాయించి, మిగతా దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని దిల్లీ జైలు నిబంధనల్లో లేదు" అని కోర్టు పేర్కొంది.  న్యాయ పరమైన అవకాశాలతో బ్రతికేస్తున్న నిర్భయ దోషులు, ప్రభుత్వానిదే బాధ్యతన్న నిర్భయ తల్లి

"ఒకవేళ విడివిడిగా ఉరిశిక్ష అమలు చేసేందుకు ఇక్కడ అనుమతి లభించినా, దోషులు ఈ తీర్పును సుప్రీంకోర్టులోనూ సవాల్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటపుడు నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లడమే సరైనది అని నా అభిప్రాయం" అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

కాగా, దోషులను విడివిడిగా శిక్షించాలనే కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను దిల్లీ హైకోర్ట్ తిరస్కరించడంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం మరియు దిల్లీ ప్రభుత్వం వేరువేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

---

నిర్భయ దోషులకు జనవరి 22నే ఉరితీయాలని మొదట డెత్ వారెంట్ జారీ చేయబడింది. అయితే అప్పుడు ముఖేశ్ సింగ్ అనే దోషి రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడంతో ఉరితీత అమలు ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. గడువు చివరి రోజున, మరో దోషి క్షమాభిక్ష పెట్టుకోవడంతో వారి ఉరితీత నిరవధిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో వారి ఎత్తుగడలకు చెక్ పెట్టేలా నిర్భయ దోషులు చట్టపరమైన అన్ని అవకాశాల కోసం వారం రోజుల గడువు ఇస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పును నిర్భయ తల్లి ఆశాదేవీ స్వాగతించారు.