Nirbhaya Case: ఉరిశిక్ష వాయిదా, చివరి నిమిషంలో 'స్టే' విధించిన పటియాలా కోర్టు, న్యాయ పరమైన అవకాశాలతో బ్రతికేస్తున్న నిర్భయ దోషులు, ప్రభుత్వానిదే బాధ్యతన్న నిర్భయ తల్లి
2012 Nirbhaya Case | (Photo Credits: File Image)

New Delhi, January 31: 2012 దిల్లీలో నిర్భయపై (Nirbhaya Case) సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన దోషుల ఉరితీతపై చిట్టచివరి నిమిషంలో దిల్లీ- పటియాలా హౌజ్ కోర్ట్ (Delhi's Patiala court) స్టే (Stay) ఇచ్చింది. ఈ నిర్భయ కేసులో దోషులుగా ఉన్న అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, మరియు వినయ్ కుమార్ శర్మలను 2020 ఫిబ్రవరి 1, శనివారం ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే దోషుల్లో ఒకడైన వినయ్ కుమార్ శర్మ చివరి నిమిషంలో రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. దీంతో మరికొన్ని గంటల్లో ఈ నలుగురికి అమలు అవ్వాల్సిన ఉరితీతను పటియాలా కోర్ట్ నిలిపి వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఉరిశిక్ష అమలు చేయలు చేయవద్దని ఆదేశించింది.

పటియాలా కోర్ట్ డెత్ వారెంట్ వాయిదా వేయడం ఇది రెండో సారి, వాస్తవానికి జనవరి 22నే ఉరితీయాలని మొదట డెత్ వారెంట్ (Death Warrant) జారీ చేసినా, అప్పుడు ముఖేశ్ సింగ్ అనే దోషి రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడంతో ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. ఇప్పుడు మరో దోషి కారణంగా రెండోసారి కూడా వాయిదా పడింది.  మాకు చావు రాదు... భారత న్యాయ వ్యవస్థకు నిర్భయ దోషుల కఠిన పరీక్ష

ఈరోజు కోర్ట్ తాజా తీర్పు తర్వాత, దోషుల తరఫు వాదిస్తున్న ఏపీ సింగ్, ఆ నలుగురికి ఎట్టి పరిస్థితుల్లో ఉరిశిక్ష పడనివ్వను అని తనతో ఛాలెంజ్ చేశారని నిర్భయ తల్లి ఆశా దేవి ఆవేదన వ్యక్తం చేసింది. అయినా తాను వెనకడు వేయనని, తన పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్న బాధితురాలి తల్లి, ఆ నలుగురు దోషులను ఉరి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది.

Here's Victim's Mother Statement: 

వినయ్ శర్మకు న్యాయపరమైన అవకాశాలు ఉన్నందున, అతడి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉండటం కారణంగా ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన అదనపు సెషన్స్ న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా 'స్టే' విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక కేసులో దోషులకు ఒకే శిక్ష పడినపుడు, ఒకరికి శిక్ష ఆగితే మిగతా వారికీ అదే వర్తిస్తుందని తన తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు.

దీంతో ఇప్పుడు ఇప్పుడు వినయ్ శర్మ క్షమాభిక్ష విషయమై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  ఒకవేళ రాష్ట్రపతి అతడి అభ్యర్థనను కొట్టివేస్తే, ఆ విషయాన్ని తీహార్ జైలు అధికారులు ఆ విషయాన్ని దోషికి తెలియజేయాలి. దోషికి ఈ విషయం తెలియజేసినట్లు నిర్ధారించుకున్నాకే, కోర్ట్ తదుపరి విచారణను మొదలుపెట్టి ఆ తర్వాత మరో తేదీతో కొత్తగా డెత్ వారెంట్ జారీ చేస్తుంది.  నిబంధనల ప్రకారం, రాష్ట్రపతి క్షమాభిక్ష రద్దుకు మరియు ఉరిశిక్ష అమలుకు మధ్య దోషికి కనీసం 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే తాజా కోర్ట్ తీర్పుతో  కొన్ని గంటల్లో పడాల్సిన శిక్ష, ఇప్పటికిప్పుడు కనీసం 14 రోజుల వెనక్కి వెల్లినట్టే. ఇక ఈ లాంఛనాలు అన్నీ పూర్తయ్యేసరికి ఇంకెంత కాలం పడుతుందో. మళ్ళీ ఉరితీత చివరి క్షణాన, ఇంకో దోషి రాష్ట్రపతి క్షమాభిక్ష కోరితే.. మళ్లీ ఇది ప్రక్రియ కొనసాగుతుంది.