Indian Railways: రైళ్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడుస్తాయో తెలియదు, కరోనా దెబ్బకు భారీగా ఆదాయాన్ని కోల్పోయాం, గూడ్స్ ద్వారా రికవరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం, కీలక విషయాలను వెల్లడించిన రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్
RailTel to continue free WiFi service at railway stations after Google will stop Project Station(Photo-ANI)

New Delhi, Dec 19: దేశంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కరోనావైరస్ లాక్‌డౌన్ విధించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రైల్వే పూర్తి స్థాయిలో ఇప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించడం లేదు. ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. మరి పూర్తి స్థాయిలో రైల్వేలు ఎప్పుడు ప్రారంభం అవుతాయనే దానిపై (normal service resumption) ఇంకా రైల్వే నుంచి ఎటువంటి క్లారిటీ రావడం లేదు. ఈ విషయంపై ఇండియన్ రైల్వేస్ (Indian Railways) స్పందించింది.

కరోనావైరస్ కారణంగా దేశంలో నిలిచిపోయిన సాధారణ రైళ్ల సేవలు తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ చెప్పలేమని రైల్వే బోర్డు పేర్కొంది. ఈ విషయంలో కచ్చితమైన తేదీని చెప్పడం సాధ్యం కాదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా సాధారణ రైళ్ల సేవలను పూర్తిస్థాయిలో తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని, తమ అధికారులు ఇప్పటికే పలు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నారని బోర్డు చైర్మన్ వీకే యాదవ్ (Railway Board Chairman VK Yadav) తెలిపారు. ప్రయాణికుల్లో కొవిడ్ భయం ఇంకా అలానే ఉందని, పరిస్థితులు అనుకూలంగా మారిన వెంటనే సాధారణ రైళ్లను పునరుద్ధరిస్తామని తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,089 ప్రత్యేక రైళ్లు సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రయాణికుల ద్వారా రైల్వేకు వచ్చే ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గిందని, ఇది గతేడాదితో పోలిస్తే 87 శాతం తక్కువని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ద్వారా రైల్వేకు రూ. 4,600 కోట్ల ఆదాయం సమకూరినట్టు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇది రూ. 1,5000 కోట్లకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 53 వేల కోట్లుగా ఉన్నట్టు యాదవ్ తెలిపారు. ఇది మా ఆదాయాలను గత సంవత్సరంతో పోలిస్తే 87% తక్కువగా చేస్తుంది ”అని తెలిపారు.

ఇండియాలో కోటి దాటిన కోవిడ్ కేసులు, తెలంగాణలో తాజాగా 627 మందికి వైరస్ నిర్థారణ, ఏపీలో 458 మందికి కోవిడ్ పాజిటివ్, దేశంలో తాజాగా 25,153 మందికి కరోనా

గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్రయాణీకుల విభాగం నుండి వచ్చే ఆదాయంలో 87% తగ్గుదల కనిపించింది. అయితే, ప్రయాణీకుల విభాగంలో నష్టం సరుకు ద్వారా వచ్చే ఆదాయాల నుండి రికవరీ కాబడుతుందని, ఇది గత సంవత్సరం గణాంకాలను దాటుతుందని భావిస్తున్నారు. డిసెంబరు నాటికి, జాతీయ రవాణాదారు ఇప్పటికే గత సంవత్సరం లోడింగ్‌లో 97% సాధించారని ఆయన అన్నారు. కాగా కరోనావైరస్ మహమ్మారి కారణంగా రైలు సేవలను నిలిపివేయడం వల్ల రైల్వే ప్రయాణీకుల ఆదాయంలో భారీ నష్టాలను చవిచూసింది.

కోల్‌కతా మెట్రో తన సర్వీసుల్లో 60% నడుపుతుండగా, ముంబై సబర్బన్ 88% రైళ్లను నడుపుతోందని, 50% చెన్నై సబర్బన్ సర్వీసులు నడుస్తున్నాయని యాదవ్ తెలిపారు. సీనియర్ రైల్వే అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని, సాధారణ రైలు సర్వీసులు దశలవారీగా “నెమ్మదిగా” తిరిగి ప్రారంభమవుతాయని యాదవ్ తెలిపారు.