India Coronavirus: ఇండియాలో కోటి దాటిన కోవిడ్ కేసులు, తెలంగాణలో తాజాగా 627 మందికి వైరస్ నిర్థారణ, ఏపీలో 458 మందికి కోవిడ్ పాజిటివ్, దేశంలో తాజాగా 25,153 మందికి కరోనా
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, December 19: దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం కోటి (India Coronavirus) దాటింది. దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 25,153 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,04,599కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 347 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,45,136 కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 95,50,712 మంది కోలుకున్నారు. 3,08,751 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 16,00,90,514 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,71,868 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తెలంగాణలో గత 24 గంటల్లో 627 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 721 మంది కోలుకున్నారు.

కరోనాపై ప్రపంచ యుద్ధం జరుగుతోంది, లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధించాలనుకుంటే 10 రోజుల ముందు చెప్పండి, కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,822కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,72,370 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,510కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,942 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,814 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 64,01,082 కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 69,062 కరోనా పరీక్షలు నిర్వహించగా 458 మందికి కరోనా పాజిటివ్ (AP Coronavirus) అని తేలింది, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 98 కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా జిల్లాలో 78, తూర్పు గోదావరి జిల్లాలో 54, గుంటూరు జిల్లాలో 41 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో 13 చొప్పున కేసులు గుర్తించారు. అదే సమయంలో 534 మందికి కరోనా నయం కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,77,806 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,66,359 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,377కి తగ్గింది. మొత్తం మరణాల సంఖ్య 7,070కి చేరింది.