Pushpa Srivani TikTok: సీఎం జగన్ పాటపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ , మూడు రాజధానులపై అమరావతిలో కొనసాగుతున్న వేళ వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం వీడియో
Pushpa Sreevani TikTok Video | Photo: Facebook

Amaravati, January 1:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ ఉన్న ఒక పాటపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పి.పుష్ప శ్రీవాణి (Pamula Pushpa Sreevani) స్వయంగా చేసిన టిక్ టాక్ వీడియో (TikTok video) సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదలైన 'రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా' అంటూ సాగే పాటపై పుష్ప శ్రీవాణి స్వయంగా సెల్ఫీ వీడియో చేశారు.

ఒకవైపు సీఎం జగన్ (CM YS Jaganmohan Reddy) చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాంతంలో ఉధృతంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల నుంచి సానుకూలత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి చేసిన ఈ టిక్ టాక్ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశం అవడమే కాకుండా, అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Here's the video: 

మూడు రాజధానుల ప్రతిపాదనను  ఒక్క అమరావతి ప్రజలు వ్యతిరేకించినా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలు సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అని చెప్పే ఉద్దేశ్యంతో చేశారా? అని కొన్నివర్గాలు అనుమానపడుతుండగా, తానొక ఉపముఖ్యమంత్రి అనే స్థాయిని మరిచి టిక్ టాక్ వీడియోలు చేయడం పట్ల మరికొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏపి ఉపముఖ్యమంత్రి ప్రజాసేవను మరిచి టిక్ టాక్ వీడియోలతో బిజీగా ఉన్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

జగన్ కేబినేట్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న 33 ఏళ్ల ఈ మహిళా నేత, పశ్చిమ గోదావరిలో జన్మించి, పెళ్లి తర్వాత విజయనగరంలో స్థిరపడ్డారు. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, కురుపాం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇటీవల సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను తెలిపే 'అమృత భూమి' అనే తెలుగు సినిమాలో కూడా పుష్ప శ్రీవాణి నటించారు. ఆ సినిమాలో ఆమె టీచర్ పాత్రను పోషించారు.