Shiv Sena MP Sanjay Raut: రాహుల్‌కి పగ్గాలు ఇవ్వకుంటే కాంగ్రెస్ కనుమరుగు, సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, పార్టీని ప్రక్షాళన చేయాలని హితవు
Shiv Sena MP Sanjay Raut (Photo Credits: ANI)

Mumabi, August 30: కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షఎన్నిక కోసం ఆరు నెలల గడువు విధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మధ్య సీనియర్ నేతలు అధ్యక్ష మార్పు రావాలంటూ లేఖ రాసి కాంగ్రెస్ పార్టీలో ముసలం రేపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తాత్కాలిక చీఫ్‌ సోనియా గాంధీకి 23 మంది ఆ పార్టీ సీనియర్‌ నేతలు లేఖ రాయడం పట్ల శివసేన ఎంపీ (Shiv Sena MP Sanjay Raut) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) పార్టీ నాయకత్వాన్ని చేపట్టకుండా నిలువరిస్తే కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతుందని ఆయన హెచ్చరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Prime Minister Narendra Modi) సరితూగే స్ధాయి కలిగిన నేత కాంగ్రెస్‌లో లేరని రౌత్‌ శివసేన పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. సీనియర్‌ నేతలు పార్టీలో క్రియాశీలకంగా ఉండకుండా నిరోధించిన వారు ఎవరని ప్రశ్నించారు. రాహుల్‌కు నాయకత్వ పగ్గాలు అప్పగించకుండా అడ్డుకుంటే అది పార్టీ వినాశనానికి దారితీస్తుందని రౌత్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం నాయకత్వంపై సాగుతున్న చర్చలో భాగంగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ సోనియాకే జై కొట్టిన కాంగ్రెస్ పెద్దలు, 6 నెలల్లో పార్టీ కొత్త చీఫ్‌ నియామకం

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గాంధీయేతరుడి ఎన్నిక మంచి ఉద్దేశమే అయినా లేఖ రాసిన 23 మందిలో అలాంటి సామర్థ్యం ఉన్న నేత ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ చావులేని వృద్ధ మహిళ వంటిదని ఆ పార్టీ దివంగత నేత వీఎన్‌ గాడ్గిల్‌ అభివర్ణించేవారని, అలాంటి పార్టీని ఎలా కాపాడుకోవాలో రాహుల్‌ నిర్ణయించుకోవాలని రౌత్‌ అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీని ప్రక్షాళన చేయాలని, అన్ని స్ధాయిల్లో చురుకుగా ఉండే పూర్తికాల అధ్యక్షులను నియమించాలని 23 మంది కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీకి (Sonia Gandhi) రాసిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై గులాం నబీ ఆజాద్‌, కపిల్‌ సిబల్‌, మనీష్‌ తివారీ, ఆనంద్‌ శర్మ వంటి 23 మంది నేతలు సంతకాలు చేశారు. కాగా సోనియా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ లేఖ రాయడం పట్ల సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్‌ సీనియర్‌ నేతలపై మండిపడ్డారు. మీరంతా బీజేపీతో కుమ్మక్కయ్యారు, సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఆగ్రహం

బీజేపీతో కుమ్మక్కయ్యారని సీనియర్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సైతం దుమారం రేపాయి. రాహుల్‌ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన సీనియర్లు రాజీనామాకు సిద్ధపడగా వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్‌ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాగా, మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో శివసేన ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే.