TTD Dharmic Programs: టిటిడి ధార్మిక కార్యక్రమాలపై ప్రశంసలు కురింపించిన శ్రీస్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామి, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి
Sri Swarupanandendra Saraswati Maha Swamy (Photo-TTD)

తిరుపతి, 31 జనవరి 2023: లోక కళ్యాణం కోసం టిటిడి నిర్వహిస్తున్న చతుర్వేద హవనాలు, పారాయణ కార్యక్రమాలు ఇతర ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామి ఉద్ఘాటించారు. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, శ్రీ‌ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ సంయుక్త ఆధ్వ‌ర్యంలో విశాఖ‌ప‌ట్నంలోని పెందుర్తిలో గ‌ల శ్రీశార‌దా పీఠంలో జ‌న‌వ‌రి 27 నుండి 31వ తేదీ వ‌ర‌కు చ‌తుర్వేద హ‌వ‌నం నిర్వహించారు. చివరి రోజైన మంగళవారం పూర్ణాహుతితో ఈ హవనం ముగిసింది.

శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామివారు, ఉత్త‌ర పీఠాధిప‌తి శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామివారు, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో జరగనున్న విశేష ఉత్స‌వాలు ఇవే, జనవరి 28వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం

ఈ సందర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామివారు అనుగ్రహభాషణం చేస్తూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలను అందిస్తున్న టిటిడి బోర్డును, ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డిని అభినందించారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, శ్రీనివాస కల్యాణాలు, శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు, వేదపారాయణం, హోమాలు, గో సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు.

టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా చ‌తుర్వేద హ‌వ‌నాలు నిర్వహిస్తామని తెలిపారు. శారదా పీఠం స్వామీజీల ఆశీస్సుల‌తో మానవాళి శ్రేయస్సు కోసం 5 రోజుల పాటు ఈ చ‌తుర్వేద హ‌వ‌నం నిర్వ‌హించామన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో 32 మంది వేద పండితులు, శాస్త్ర పండితులు పాల్గొన్నారని చెప్పారు.

విశాఖ వాసులు పెద్ద సంఖ్యలో ఈ హవనాన్ని దర్శించారని, ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన లభించిందని తెలియజేశారు. ఈ హ‌వ‌నంలో పాల్గొన్న భ‌క్తుల‌కు సుఖ‌శాంతులు, ధ‌న‌ధాన్యాలు, దీర్ఘాయుష్షు చేకూరుతాయ‌ని పండితులు తెలిపారని చెప్పారు.ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రాజెక్టు అధికారి శ్రీమతి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.