Roja Discharged From Hospital: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే రోజా, మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని తెలిపిన డాక్టర్లు, రోజాను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
Roja Discharged From Hospital (Photo-Twitter)

Amaravati, April 4: రెండు మేజర్‌ సర్జరీలు చేసుకొని చెన్నై మలర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా శనివారం డిశ్చార్జి (Roja Discharged From Hospital) అయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆర్కేసెల్వమణి తెలిపారు. వైద్యుల సూచన మేరకు మూడు వారాల పాటు ఆమె విశ్రాంతి తీసుకోనున్నారు.

ఎమ్మెల్యే ఆర్కేరోజా (Nagari MLA Roja Selvamani) పూర్ణారోగ్యంతో ఉండాలని కోరుతూ నగరి వైఎస్సార్‌ సీపీ నాయకులు శనివారం నేత్రప్రదాత శ్రీదేశమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే పేరిట అర్చనలు చేసి, 101 కొబ్బరికాయలు కొట్టారు. దేశమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ బాబురెడ్డి, ఆస్పత్రి కమిటీ డైరెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవరాజులు రెడ్డి, మధు, బాలాజీ, సుబ్రమణ్యం, రామన్, గోవర్ధన్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రోజా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ శనివారం నేసనూరులో గ్రామ దేవత శ్రీకలుగు లక్ష్మమ్మ ఆలయంలో సర్పంచి గోవిందస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా ఆర్గనైజర్‌ సుబ్రహ్మణ్యం, తిరుమలరెడ్డి, కుమార్, ఢిల్లీ, మురళి తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో కరోనాతో ఒకేరోజు 9 మంది మృతి, తాజాగా 1,398 మందికి కరోనా వైరస్, ప్రస్తుతం రాష్ట్రంలో 9417 యాక్టివ్‌ కేసులు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో కరోనా కల్లోలం

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ఐదు రోజులుగా చెన్నైలో రోజా చికిత్స పొందుతున్నారు. రెండు మేజర్‌ ఆపరేషన్లు జరగడంతో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు.