AP Weather Report: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచన, అలర్ట్ మెసేజ్ జారీ చేసిన వాతావరణ శాఖ
ఏపీలో రానున్న రెండు రోజలు పాటు ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు (Moderate rain) కురవనున్నాయి. తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా–పశ్చిమబెంగాల్ తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ (India Meteorological Department) తెలిపింది.
Amaravati, Sep 12: ఏపీలో రానున్న రెండు రోజలు పాటు ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు (Moderate rain) కురవనున్నాయి. తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా–పశ్చిమబెంగాల్ తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ (India Meteorological Department) తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వెల్లడించింది.
అయితే కోస్తా తీరానికి (Coastal Andhra Pradesh ) సమీపం నుంచి కదులుతుండటంతో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఉభయగోదావరి జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. కోస్తా, రాయలసీమల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ రెండో వారం వరకూ వర్షాలు పడే సూచనలున్నాయనీ.. తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టి.. పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది.
దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రేపటి వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కాగా, నిన్న శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పలాసలో అత్యధికంగా 79.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో శుక్రవారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు.
(The above story first appeared on LatestLY on Sep 12, 2021 09:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

