Statue Of Equality: 11వ రోజు వైభవంగా శ్రీభగద్రామానుజుల సహస్రాబ్ది సమారోహం, రామానుజాచార్యుల విగ్రహం ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ముచ్చింతల్లోని సమతా క్షేత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషిజీ, అశ్వనీకుమార్ చౌబే, మెగాస్టార్ చిరంజీవి సందర్శించారు. 216 అడుగుల శ్రీభగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 : ముచ్చింతల్లోని సమతా క్షేత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషిజీ, అశ్వనీకుమార్ చౌబే, మెగాస్టార్ చిరంజీవి సందర్శించారు. 216 అడుగుల శ్రీభగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయాల విశిష్టతను, సమతామూర్తి ప్రాంగణ విశేషాలను వారికి వివరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. అనంతరం డిజిటల్ గైడ్ ద్వారా రామానుజాచార్యుల జీవితచరిత్రను తెలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి సహా అతిథులకు రామానుజాచార్యుల ప్రతిమను బహూకరించి సత్కరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏమన్నారంటే...
216 అడుగుల సమతామూర్తి విగ్రహ ఏర్పాటు ప్రపంచంలో ఎనిమిదో అద్భుతంగా అభివర్ణించారు ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడుజీ. ఈ మహత్ కార్యాన్ని విజయవంతం చేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీకి, మై హోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుకు భారత ప్రభుత్వం తరపున అభినందనలు తెలుపుతున్నానన్నారు వైస్ ప్రెసిడెంట్. సనాతన ధర్మ విప్లవానికి నాందిపలికిన శ్రీభగవద్రామానుజుల విగ్రహాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వెంకయ్యనాయుడుజీ. సామాజిక సంస్కరణ అభిలాషిగా సమాజంపై రామానుజాచార్యులు చెరగని ముద్ర వేశారన్నారు. ఆయన సమాజంలోని అసమానతలను తొలగించేందుకు కృషి చేశారన్నారు. కుల, లింగ వివక్షపై వెయ్యేళ్ల క్రితమే పోరాడిన మహనీయులు రామానుజాచార్యులన్నారు ఉపరాష్ట్రపతి. విశిష్ట అద్వైత సిద్ధాంతంతో సమాజంలో వివక్షను పారదోలారన్నారు. కులం కన్నా గుణం మిన్నా అని చెప్పడమే కాకుండా ఆచరణలో చూపించారన్నారు. ప్రతి ఒక్కరూ కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని, గురువును గుర్తుపెట్టుకోవాలన్నారు వెంకయ్యనాయుడుజీ.
The Vice President, Shri M. Venkaiah Naidu visiting the Statue of Equality in Hyderabad today. #StatueOfEquality pic.twitter.com/kxkSzCZ7i2
— Vice President of India (@VPSecretariat) February 12, 2022
అటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీశ్ శంకర్ రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని దర్శించుకున్నారు . 108 దివ్యదేశాలను సందర్శించారు. వారికి ఆలయ విశేషాలనుమైహోంగ్రూప్ డైరెక్టర్ జూపల్లి రామురావు వివరించారు.
మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే...
సమతామూర్తిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు మెగాస్టార్ చిరంజీవి. సమతామూర్తి భారీ విగ్రహం ప్రపంచంలో ఎనిమిదో అద్భుతమన్న ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు అక్షరసత్యమన్నారు మెగాస్టార్. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు చరిత్రలో నిలిచిపోతారన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మనవరాలు ఇద్య భరత నాట్యం అందరినీ ఆకట్టుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుజీ, హర్యానా గవర్నర్ దత్తాత్రేయజీ, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, అశ్వనీకుమార్ చౌబేజీ, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మెగాస్టార్ చిరంజీవి.. జూపల్లి ఇద్య నాట్యం చూసి మంత్రముగ్దులయ్యారు. జూపల్లి ఇద్య భరత నాట్యం అద్భుతంగా ఉందని ప్రశంసించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
(The above story first appeared on LatestLY on Feb 12, 2022 10:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

