Bhainsa Riots: భైంసాలో మళ్లీ ఇరువర్గాల మధ్య గొడవలు, 144 సెక్షన్‌ అమల్లోకి, అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరా, బాధితులకు న్యాయం చేయాలని తెలిపిన మంత్రి కేటీఆర్, ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపిన బండి సంజయ్
Union Home Minister & BJP leader Amit Shah (Photo-PTI)

Niramal, Mar 8: తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలోని భైంసాలో మరోసారి ఇరువర్గాల మధ్య ఘర్షణ (Bhainsa witnesses communal clash) చోటుచేసుకుంది. ఒక వర్గంపై మరో వర్గం రాళ్లు రువ్వుకున్నారు. ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ (Bhainsa Riots) అల్లర్లకు దారితీసినట్టుగా తెలుస్తోంది. దీంతో జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

పోలీసులు అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే.. కొందరు వాహనాలు, దుకాణాలకు నిప్పంటించడంతో అవి దహనమయ్యాయి. ఇరువర్గాలు తలలు పగిలేలా రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు, ఓ ఎస్సై, కానిస్టేబుల్‌తోపాటుగా ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది కూడా ఉన్నారు. వారిలో కొందరికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా.. తీవ్రంగా గాయపడినవారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

భైంసాలో భయం భయం, హింసాకాండ నేపథ్యంలో పట్టణంలో రాత్రివేళ కర్ఫ్యూ విధింపు, నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత, భైంసాలో ఎన్నికలు రద్దు చేయాలని భాజపా డిమాండ్

దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. రాళ్లదాడిలో దెబ్బలు తిన్నవారి తల, ముఖం, ఇతర సున్నిత భాగాలకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. రక్తం కారుతూనే వారిని ఆస్పత్రికి తరలిస్తున్న వీడియోలను చూస్తే ఘర్షణ తీవ్రంగా జరిగినట్లుగా అర్థమవుతోంది. పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో బైంసాలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

అయితే అప్పటికే చాలా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక, భైంసాలో డీఎస్పీ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ విశ్వ వారియర్‌ భైంసా చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇక, గతేడాది కూడా భైంసాలో అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

భైంసా హింసాకాండ షాక్, కొడుకుల అరెస్ట్ తో తల్లిదండ్రుల హఠాన్మరణం, ఐకమత్యంగా ఇంటికి తరలివచ్చి సంతాపం తెలిపిన అన్ని వర్గాల ప్రజలు

తాజా అల్లర్ల నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలను నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి భారీగా భైంసాకు తరలిస్తున్నారు. భైంసా పట్టణం ఇప్పుడు నిఘా నీడలో ఉంది. డ్రోన్ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ, పట్టణంలోకి ఇతరులు రాకుండా పికెటింగ్‌లను పోలీసులు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ను అమలు చేశారు. గతంలో కూడా కొన్నిసార్లు భైంసా పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే.

భైంసాలో చెలరేగిన మత ఘర్షణలు, అర్ధరాత్రి వరకు బీభత్సం, 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు, నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితులు

భైంసా అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలను వాకబు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అమిత్ షాకు మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. భైంసా అల్లర్ల ఘటనలో బాధితులకు న్యాయం జరగాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హోం మంత్రి డీజీపీలను కోరారు.

ఇక, భైంసాలో జరిగిన అల్లర్లను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. అల్లర్లలో ఇద్దరు రిపోర్టర్లు, పోలీసులు, బీజేపీ కార్యకర్తలు గాయపడటంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే అల్లర్లను ఆపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు భయపడి పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాయద్దని విమర్శించారు. భైంసాలో జరిగిన అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గాయపడినవారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని కోరారు.