Hyderabad Shocker: మీర్‌పేట్‌లో దారుణం, తమ్ముడి ముందే కత్తితో బెదిరించి అక్కపై నలుగురు కామాంధులు అత్యాచారం, కేసు దర్యాప్తు చేస్తున్న రాచకొండ పోలీసులు
Representational image (Photo Credit- IANS)

Meerpet, August 22: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కత్తులతో బెదిరించి నలుగురు యువకులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. తిరుమలగిరి లాల్‌బజార్‌కు చెందిన బాలిక (16) పదిహేను రోజుల క్రితం నందనవనంలో నివాసముండే తన అక్క (పెద్దనాన్న కూతురు) ఇంటికి వచ్చింది.

సోమవారం ఉదయం ఇంట్లోని వారు బయటకు వెళ్లగా.. ఎనిమిది మంది దుండగులు వచ్చి తలుపులు కొట్టారు. ఈ సమయంలో ఇంట్లో బాధిత బాలికతో పాటు ఆమె తమ్ముడు, మరో నలుగురు చిన్నారులు లోపల ఉన్నారు. వీరిని కత్తులతో బెదిరించిన నలుగురు యువకులు బాలిక మినహా అందరినీలో మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. బాలికను మాత్రం అదే గదిలో ఉంచి మిగిలిన నలుగురు లైంగికదాడికి పాల్పడ్డారు.

కన్నకూతురుపై అత్యాచారం, మూడేళ్ల విచారణ అనంతరం కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్ష విధించిన విశాఖ పోక్సో కోర్టు

అనంతరం అందరూ కలిసి పారిపోయారు. బాలిక అక్క వచ్చిన తర్వాత జరిగిన విషయం చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటలకు మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి ఏడు బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు మీర్‌పేట సీఐ కిరణ్‌కుమార్‌ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు.

విషయం తెలుసుకున్న రాచకొండ పోలీసు కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మీర్‌పేట పోలీసులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు, పోలీసుల పనితీరుపై ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా యువకులు గంజాయి సేవించి ఉంటారనే స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్లో నలుగురు స్థానికంగా ఉంటారని, ఇందులో అబేద్‌లాలా, టైసన్‌ కాగా మరో ఆరుగురి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.