Presidential Election 2022: ఎమ్మెల్యే సీతక్క ఓటుపైనే అందరి చర్చ, పొరపాటున ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, నా ఆత్మ సాక్షిగా నేను వేయాల్సిన వారికే ఓటు వేశానని వెల్లడి
Congress MLA Seethakka (Photo-Twitter)

Hyd, July 18: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(Congress MLA Seethakka) విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwanth Sinha)కు ఓటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్మూ(Murmu)కు వేశారు. తాను పొరపాటున ముర్ముకు ఓటు వేసినట్టు అధికారులకు సీతక్క తెలిపారు. ఈ క్రమంలో మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరింది. కాగా, నిబంధనల ప్రకారం మరోసారి అవకాశం ఇవ్వలేమని అధికారులు సీతక్కకు చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నిక.. తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్‌కు దూరంగా నలుగురు ఎమ్మెల్యేలు, ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీలో 173 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలో 117 మంది ఎమ్మెల్యేలు

అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీతక్క తెలిపారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఓటు వేయడంలో ఎలాంటి తప్పులు దొర్లలేదు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ ఇంక్ బ్యాలెట్ పేపర్ మీద పడింది. బ్యాలెట్ పేపర్‌పై ఇంక్ పడటంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాను. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంక్ పడిన బ్యాలెట్ పేపర్‌నే బాక్స్‌లో వేశాను. నా ఆత్మ సాక్షిగా నేను వేయాల్సిన వారికే ఓటు వేశాను. ఓటు వేయడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఓటు చెల్లుతుందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి’’ అని అన్నారు.