Global Recession Warning Bells Again: వచ్చే తొమ్మిది నెలల్లో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు, భారతదేశానికి మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు. ప్రముఖ అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్లడి!

రానున్న తొమ్మిది నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన పెట్టుబడులు మరియు ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanely)వెల్లడించింది.

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పరంగా ఏర్పడిన తీవ్రమైన పోటీ, ఇరు దేశాల వాణిజ్య సంబంధాల నడుమ ఆందోళనకరమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో అది మొత్తం ప్రపంచ దేశాలపై వివిధ రూపాల్లో ప్రభావం చూపనుందని, ఆయా దేశాలను ఆర్థిక మాంద్యం వైపు నెట్టేలా చేస్తుందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది.

కొన్ని ఖచ్చితమైన సూచికల ద్వారా ఆర్థిక మాంద్యం హెచ్చరిక సంకేతాలు తాము గమనిస్తున్నాము. 2008లో ఆర్థిక సంక్షోభం ఏర్పడినపుడు అమెరికాతో పాటు, ప్రపంచంలోని ఎన్నో కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ధరలు భారీగా పెరిగిపోయాయి. ఎన్నో ఆర్థిక సంస్కరణలు, పొదుపు సంస్కరణలు చేపట్టడం ద్వారా ఆ ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకొని సాధారణ స్థితికి వచ్చాం. అయితే ఆ కాలంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడటానికి ముందు, బాండ్ దిగుమతి సూచి విలోమ దిశను సూచించిది. సరిగ్గా అలాంటి పరిస్థితులే మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. బాండ్ దిగుమతి సూచి విలోమ దిశను సూచిస్తుందని మోర్గాన్ స్టాన్లీ సంస్థ పేర్కొంది.

ఇప్పటికే చైనా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై అమెరికా 25 శాతానికి పెంచేసింది. దీంతో అమెరికా- చైనా దేశాలు పోటాపోటాగా ఇరుదేశాల నడుమ జరిగే ఎగుమతి-దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తూ పోతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరితే వచ్చే మూడు ఆర్థిక త్రైమాసాలలో ప్రపంచం ఆర్థిక సంక్షోభంలోకి ప్రవేశించడం మనం చూస్తామని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయ పడింది.

భారత దేశంపై ఆర్థికమాంద్యం ప్రభావం అంతతమాత్రమే.

ఇదిలా ఉండగా ప్రపంచదేశాలపై ఆర్థికమాంద్యం ఎలాంటి ప్రభావాన్ని చూపినా, భారత దేశంలో దానిని ప్రభావం అంతంతమాత్రమే ఉండొచ్చని ఆ సంస్థ పేర్కొంది. అయితే కొన్ని రంగాలలో మాత్రం ట్రేడింగ్ కొంత నిరాశపరుస్తుందని పేర్కొంది. భారత్ ఎక్కువగా ఆటోమొబైల్, మొబైల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి ఇతర దేశాలపై ఆధారపడుతుంది. అలాంటి రంగాలలో భారత్ కు ఫలితాలు అనుకూలంగా ఉండకపోవచ్చు అనేది ఆ సంస్థ అభిప్రాయపడింది.

ప్రస్తుతం అగ్రరాజ్యాలకు దీటుగా భారత్ ఎదుగుతోంది. వరుసగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూకే ల తర్వాత ఆరోస్థానంలో భారత్ కొనసాగుతోంది. 'బ్రిగ్జెట్' కారణంగా ఇప్పటికే యూకేలో సంక్షోభం నెలకొంది. రానున్న కొద్ది కాలంలోనే భారత్, యూకేను అధిగమించి ఐదవ స్థానాలకు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం కూడా వచ్చే నాలుగేళ్లలో భారత్ ను 4వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ మార్చటమే తమ లక్ష్యం అని ఈ ఏడాది యూనియన్ బడ్జెట్ సందర్భంగా వెల్లడించిన విషయం తెలిసెందే.

మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలతో కేంద్రం ప్రభుత్వం దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తుంది అలాగే ఇతర దేశాల కంపెనీలను సైతం భారత్ లో పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుంటుంది. దీనికి రాష్ట్రాల సహాకారం, దేశంలోని ప్రజల సహకారం కూడా తోడైతే భారత్ కూడా 4వ ఆర్థిక వ్యవస్థ ఏర్పడటం ఎంతో దూరం కాదు.

ప్రస్తుతం 2019- 2020 సంవత్సరానికి గానూ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల టాప్ 10 దేశాలు వరుసగా ఇవే.

1) అమెరికా

2)చైనా

3) జపాన్

4) జర్మనీ

5) యునైటెడ్ కింగ్ డమ్

6) ఇండియా

7) ఫ్రాన్స్

8) ఇటలీ

9) బ్రెజిల్

10) కెనడా

ఇక ఆసియా ఖండం నుంచి కేవలం మూడే దేశాలు టాప్ 20లో స్థానం సంపాదించాయి. దక్షిణ కొరియా 11వ స్థానం, ఇండోనేషియా 16వ స్థానం మరియు సౌదీ అరేబియా 19వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రస్తుతం 24వ స్థానంలో కొనసాగుతూ జీడీపీ సూచి మరింత దిగువకు సూచిస్తుంది.