K Viswanath Last Rites: ముగిసిన కే విశ్వనాథ్‌ అంత్యక్రియలు, బ్రాహ్మాణ సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు,కడచూపు కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు
K Viswanath Last Rites (Photo-Video Grab)

ప్రముఖ లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌ (K Viswanath) అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశానవాటికలో ముగిశాయి. కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుమందు ఫిలిం చాంబర్‌లో కే విశ్వనాథ్‌ పార్థీవదేహానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.

అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్‌ నుంచి పంజాగుట్ట వర​కు అంతిమ యాత్ర సాగింది.అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని కళాతపస్వికి తుది వీడ్కోలు పలికారు.బ్రాహ్మాణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

విశ్వనాథ్‌ మరణంతో శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ, అన్ని షూటింగులు బంద్‌ చేస్తున్నట్లు తెలిపిన టాలీవుడ్, కళా తపస్వికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కే విశ్వనాథ్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీతోపాటు వివిధ సినీ పరిశ్రమల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కే విశ్వనాథ్‌ ఎన్నో మరుపురాని సినిమాలతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారని గుర్తు చేసుకున్నారు