COVID19 Emergency Package: కోవిడ్-19పై పోరాటానికి రాష్ట్రాలకు రూ. 15 వేల కోట్ల అత్యవసర నిధులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సహా దేశంలోని 9 రాష్ట్రాలకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందాల తరలింపు
COVID-19 Outbreak in India. | PTI Photo

New Delhi, April 10:  కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటానికి (Combat Against COVID-19)  రాష్ట్రాలకు రూ.15 వేల కోట్ల అత్యవసర ప్యాకేజీని (Emergency Package) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పోరాడుతున్న జాతీయ, రాష్ట్ర స్థాయి ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఈ 15,000 కోట్లను భారత ప్రభుత్వం కేటాయించింది.

ఈ నిధులను ప్రధానంగా కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు, కోవిడ్ -19 చికిత్సకు సౌకర్యాల కల్పన, వైద్య పరికరాలు మరియు చికిత్సకు అవసరమయ్యే ఔషధాల ఉత్పత్తి, భవిష్యత్తు అవసరాల కోసం ముందస్తుగా సిద్ధంగా ఉండేలా ఆరోగ్య వ్యవస్థలను అభివృద్ధి పరచటానికి ఉపయోగించనున్నారు.

మంజూరు చేసిన మొత్తం నిధుల్లో రూ. 7,774 కోట్లు కోవిడ్ -19 అత్యవసర చర్యల కోసం వినియోగించనుండగా, మిగతా నిధులను మిషన్ మోడ్ విధానం కింద అందించే మీడియం-టర్మ్ (1-4 సంవత్సరాలు) సపోర్ట్ కోసం వినియోగించనున్నారు.  ప్రైవేట్ ఆసుపత్రులైనా, ల్యాబ్‌లైనా కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయాలి: సుప్రీంకోర్ట్

Update by ANI:

మూడు దశల్లో ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. జనవరి 2020 నుంచి జూన్‌ 2020 వరకు మొదటి దశ, జులై 2020 నుంచి మార్చి 2021 వరకు రెండో దశ, ఏప్రిల్‌ 2021 నుంచి మార్చి 2024 వరకు మూడో దశగా కేంద్రం నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్-19 బారినపడిన వారి సంఖ్య 6 వేలకు చేరువ కాగా, 169 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనావైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలకు సహాయపడటానికి 10 'హైలెవెల్ మల్టీ డిసిప్లినరీ' బృందాలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ బృందాలను తక్షణమే తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర ప్రదేశ్ లకు తరలించారు.

కోవిడ్-19 పోరాటంలో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖలతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖ కూడా తమవంతు సహాకారాన్ని అందిస్తుంది. సుమారు 5000 రైలు బోగీలలో 80,000 పడకలతో కూడిన ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే 3250 బోగీలను ఐసోలేషన్ సౌకర్యాలున్న గదులుగా మార్చారు.  భారత్ వైపు చూస్తున్న ప్రపంచంలోని 30కి పైగా దేశాలు, ఎందుకంటే?!

అంతేకాకుండా సుమారు 2,500 మంది వైద్యులను, 35,000 పారామెడిక్స్ సిబ్బందిని రంగంలోకి దించటంతో పాటు పాటు 586 హెల్త్ యూనిట్లు, 45 సబ్ డివిజనల్ హాస్పిటల్స్, 56 డివిజనల్ హాస్పిటల్స్, 8 ప్రొడక్షన్ యూనిట్ హాస్పిటల్స్ మరియు 16 జోనల్ హాస్పిటల్స్ ను సిద్ధం చేసింది. దేశంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రస్తుతం ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్త లాక్డౌన్ అమలులో ఉంది. రేపు లేదా ఎల్లుండి ఈ లాక్డౌన్ పొడగించే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.