Aatma Nirbhar Bharat Package-4: బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యం తొలగింపు, రక్షణలో ఎఫ్‌డీఐ పరిమితి 74 శాతానికి పెంపు, ప్రైవేటుకు మరో 6 విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి నిర్మల ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ-4 ముఖ్యాంశాలు
Nirmala Sitharaman addressing the press | (Photo Credits: ANI)

New Delhi, May 16: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడతల వారీగా ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ యొక్క 4వ విడత ప్రకటనల్లో పలు నిర్మాణాత్మక సంస్కరణలను ఆవిష్కరించారు. ఈ సంస్కరణలు రక్షణ ఉత్పత్తి, మైనింగ్ మరియు పౌర విమానయాన రంగాలను రీబూట్ చేయడానికి ఉద్దేశించబడినవి.

రక్షణ రంగంలో ఎఫ్‌డిఐల పెంపు, మైనింగ్‌లో ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని సడలిస్తూ వాణిజ్య రంగాల వారికి అవకాశం, ప్రైవేటు రంగానికి అంతరిక్ష పరిశోధన, విమానాశ్రయాలు, విద్యుత్‌ పంపిణీ సంస్థలు, అటామిక్‌ ఎనర్జీ నిర్వహణ సీతారామన్ ప్రకటనలో ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి.

రక్షణ ఉత్పత్తి రంగం

దేశీయ మూలధన సేకరణ కోసం బడ్జెట్‌లో ప్రత్యేక ప్రొవిజన్‌ పెడతామని చెప్పారు. ఆయుధాలు మరి రక్షణ సామాగ్రి దిగుమతి వ్యయాన్ని తగ్గించుకుంటామని పేర్కొన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' ను బలోపేతం చేసేలా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలను భారత్‌లోనే తయారు చేస్తామని వెల్లడించారు. పలు రకాల ఆయుధాలు, రక్షణ పరికరాలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసి వాటి దిగుమతులపై నిషేధం విధిస్తామని, పరిస్థితులను బట్టి ఏడాదికోసారి సమీక్ష ఉంటుందని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

"రక్షణ ఉత్పత్తుల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 నుంచి 74 శాతానికి పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కోసం, దాని పనితీరును మెరుగుపరచడానికి మరియు జవాబుదారీగా చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ప్రక్రియలో భాగంగా, ప్రభుత్వం తన "కార్పొరేటైజేషన్" ను ప్రారంభించింది. బోర్డు ప్రైవేటీకరణ కావడంతో దీనిలో జోక్యం ఉండదు అని సీతారామన్ స్పష్టం చేశారు. ఆయుధాలను ఉత్పత్తి చేసే సంస్థ స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడుతుందని ఆమె తెలిపారు.

సివిల్ ఏవియేషన్ సెక్టార్ 

ఇండియన్ ఎయిర్ స్పేస్ వినియోగంపై పరిమితులు సడలించబడతాయి, తద్వారా పౌర విమానయానం మరింత సమర్థవంతంగా మారుతుంది. దీనివల్ల మొత్తం రూ. విమానయాన రంగానికి సంవత్సరానికి రూ. 1000 కోట్ల మేర లబ్ది చేకూరుతుందని తెలిపారు. సీతారామన్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

" పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పిపిపి) ప్రాతిపదికన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానాశ్రయాల ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం 6 బిడ్లలో 3 విమానాశ్రయాలను అప్పగించింది. మొదటి మరియు రెండవ రౌండ్లలో కొత్తగా 12 విమానాశ్రయాల నిర్మాణాల కోసం అదనంగా రూ. 13,000 కోట్లను సీతారామన్ ప్రకటించారు.

ఖనిజ రంగం

మైనింగ్ రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తొలగిస్తూ వాణిజ్య మైనింగ్ ప్రారంభిస్తామని సీతారామన్ తెలిపారు. ఆదాయ భాగస్వామ్య విధానం ద్వారా బొగ్గు రంగంలో పోటీ, పారదర్శకత మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది" అని మంత్రి తెలిపారు.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సహాయంతో అంతరిక్ష పరిశోధనలను ప్రారంభించడానికి ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అనుమతిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. భారత అంతరిక్ష రంగ ప్రయాణంలో 'భారతీయ ప్రైవేటు రంగం' ఒక సహ-యాత్రికురాలిగా వ్యవహరిస్తుంది. ఉపగ్రహాలు, ప్రయోగాలు మరియు అంతరిక్ష ఆధారిత సేవలలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించబడుతుందని నిర్మలా చెప్పారు.

ప్రైవేటు రంగం వారి సామర్థ్యాలను మెరుగుపర్చడానికి ఇస్రోకు సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు మరియు ఆస్తులను ఉపయోగించడానికి అనుమతించబడుతుంది. గ్రహాల అన్వేషణ, అంతరిక్ష యానం మొదలైన వాటి కోసం భవిష్యత్తు ప్రాజెక్టులలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించబడుతుంది అని నిర్మల సీతారామన్ తెలిపారు.

ప్రధాని ప్రకటించిన ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీకి సంబంధించి ఇప్పటివరకు వ్యవసాయం, ఎంఎస్‌ఎంఇలు, భారీ తరహా పరిశ్రమలు, కార్మిక-ఇంటెన్సివ్ రంగాలతో సహా భారతీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ అంశాలన్నింటి గురించి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఇక చివరి విడతగా ఈ ప్యాకిజీలో మిగిలిన అంశాలను రేపు, ఆదివారం ఉదయం 11 గంటలకు మరోసారి మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించనున్నారు.