
Vijayawada, Feb 24: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు (APPSC Group-2 Mains) ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. పేపర్ -1 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలు ఉంటే psc. ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ నెల 25 నుంచి 27వ తేదీ లోపు తెలపాలని ఏపీపీఎస్సీ సూచించింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్ - 2 మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోగా, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వారిలో 92 శాతం మంది హాజరయ్యారు. మొదటి సెషన్ లో ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, రెండో సెషన్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహించారు.
ప్రాథమిక ‘కీ’ కోసం క్లిక్ చేయండి
APPSC Group 2 Mains Key Andhra Pradesh
నాటకీయ పరిణామాల మధ్య పరీక్షలు
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఏపీపీఎస్సీ పేర్కొంది. అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిషన్ కార్యదర్శి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓ వైపు అభ్యర్ధులు పరీక్ష వాయిదా వేయాల్సిందేనంటూ నిరసనలు కొనసాగిస్తుంటే.. మరో వైపు ఏపీపీఎస్సీ అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం జరిగిన నాటకీయ పరిణామాల మధ్య అభ్యర్ధుల విన్నపం మేరకు పరీక్ష వాయిదా వేయాలని ప్రభుత్వం లేఖ రాసినా.. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసిన వారని, వాయిదా వేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని, ఆదివారం యథావిథిగా పరీక్ష నిర్వహించేందుకే ఏపీపీఎస్సీ మొగ్గుచూపింది. అయితే ఏపీపీఎస్సీ వైఖరి పట్ల కొందరు అభ్యర్థులు మండిపడ్డారు.