Mob Lynching Row: మణిరత్నంతో సహా, 49మంది సెలబ్రిటీలపై దేశ ద్రోహం కేసు, దేశ ప్రతిష్టను, ప్రధానిని కార్యదక్షతను దిగజార్చారంటూ పిటిషన్, బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కేసు నమోదు..
fir-against-mani-ratnam-adoor-and-47-others-who-wrote-Pm-modi-communal-violence (Photo-PTI)

Muzaffarpur,October 4:  దేశంలో పెరిగిపోతున్న మూక దాడులను తక్షణం ఆపాలని, జైశ్రీరాం నినాదం కొందరు నేరస్తుల చేతిలో ఆయుధంగా మారిందంటూ దేశంలోని 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సంగతి విదితమే. కాగా మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన ఈ 49 మంది సెలబ్రిటీలపై బిహార్ లోని ముజఫర్‌పూర్ లో కేసు నమోదైంది. వీరిపై దేశద్రోహ ఆరోపణలతో కేసును నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సినీ దర్శకుడు మణిరత్నం, రామచంద్ర గుహ, అపర్ణా సేన్, శ్యామ్ బెనగళ్, అనురాగ్ కశ్యప్, సౌమిత్ర ఛటర్జీ తదితరులు ఉన్నారు. స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా ఈ లేఖపై కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ వీరందరిపై కేసు నమోదు చేయాలని రెండు నెలల క్రితం ఆదేశాలు జారీ చేశారు.

కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. లేఖపై సంతకాలు చేసిన 50 మంది వ్యక్తులను నిందితులుగా పేర్కొంటూ తాను పిటిషన్ వేశానని ఈ సందర్భంగా సుధీర్ కుమార్ తెలిపారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రధాని కార్యదక్షతను కించపరిచేలా వీరు వ్యవహరించారని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు వీరిపై దేశద్రోహం, పబ్లిక్ న్యూసెన్స్, మత విశ్వాసాలకు విఘాతం కలిగించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలపై జరుగుతున్న మూకదాడులను తక్షణమే నిలిపివేయించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గతంలో లేఖ రాశారు. ʹజై శ్రీరాంʹ అన్నది కేవలం రెచ్చగొట్టే యుద్ధ నినాదంగా మారిపోయిందని ఆ లేఖలో వారు విమర్శించారు. ప్రభుత్వ అభిప్రాయాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులనో, అర్బన్‌ నక్సలైట్లనో ముద్ర వేయడం తగదని తమ లేఖలో పేర్కొన్నారు. దీనిపై సంతకాలు చేసిన వారిలో ప్రముఖ సినీ దర్శకులు శ్యాం బెనగల్‌, ఆదూర్‌ గోపాలకృష్ణన్, మణిరత్నం, అపర్ణా సేన్‌, బెంగాలీ సినీ ప్రముఖుడు సౌమిత్రో ఛటర్జీ, సినీ నటి రేవతి, గాయని శుభా ముద్గల్‌, చరిత్రకారుడు రామచంద్ర గుహ తదితరులు ఉన్నారు.

ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న వదంతుల కారణంగా దేశంలో మూక దాడులు జరుగుతుండటంపై నాడు సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై ఎవరికీ పట్టింపు ఉన్నట్లుగా కనబడటం లేదని ఘాటుగా స్పందించింది. దీంతో పాటుగా ప్రతిపక్షాలు పార్లమెంట్ వేదికగా ఈ అంశంపై విరుచుకుపడటంతో మూకదాడులపై కొత్త చట్టాన్ని తెస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.