Haryana Government Formation: హర్యానాలో చక్రం తిప్పిన అమిత్ షా, ప్రభుత్వ ఏర్పాటుకు జేజేపీ అండ, దుష్యంత్ చౌతాలాకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్, విఫలమైన కాంగ్రెస్ ఫ్రయత్నాలు, మనోహర్ లాల్ ఖట్టర్నే మళ్లీ సీఎం
హర్యానాలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి రానుంది. బీజేపీ బాద్ షా, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా హర్యానా రాజకీయాల్లో తనదైన స్టైల్లో చక్రం తిప్పడంతో బీజేపీ మళ్లీ ఫ్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసుకుంది.
New Delhi,October 26: హర్యానాలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి రానుంది. బీజేపీ బాద్ షా, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా హర్యానా రాజకీయాల్లో తనదైన స్టైల్లో చక్రం తిప్పడంతో బీజేపీ మళ్లీ ఫ్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసుకుంది. జేజేపీ నేత దుష్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడం ద్వారా బీజేపీ ఆ పార్టీని తన వైపుకు తిప్పుకుంది.ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రిగా జేజేపీ నేత ఉంటారని బీజేపీ చీఫ్ అమిత్ షా, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్నే మళ్లీ సీఎంగా బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా అసెంబ్లీ ఫలితాల్లో హరియాణాలో ఏ పార్టీకి మెజారిటీ రాని విషయం తెలిసిందే. 90 స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ(జేజేపీ) కింగ్ మేకర్ అయింది. దీంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది.
కాగా హరియాణాలో మెజారిటీ వచ్చే అవకాశం లేదని అమిత్ షాకు ముందే సమాచారముందని, అందువల్ల ఫలితాల వెల్లడికి ముందే అమిత్షా దుష్యంత్ చౌతాలాతో మాట్లాడారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం శనివారం జరుగుతుందని, ఆ సమావేశానికి పరిశీలకులుగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరవుతారని బీజేపీ హరియాణా ఇన్చార్జ్ అనిల్ జైన్ వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్ శనివారం గవర్నర్ను కలిసి కోరతారని, దీపావళి తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు.
స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న సమయంలో హరియాణ్ లోక్హిత్ పార్టీ నేత, ఎమ్మెల్యే గోపాల్ కందా మద్ధతుపై వివాదం చెలరేగింది. స్వతంత్ర ఎమ్మెల్యే గోపాల్ కందాపై క్రిమినెల్ కేసులు ఉండటంతో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో జేజేపీతో సంప్రదింపులు జరిపి విజయం సాధించింది. స్వతంత్రుల్లో ఎక్కువమంది బీజేపీ రెబల్సే కావడం ఆలోచించాల్సిన విషయం.
కాంగ్రెస్కు చెందిన మాజీ సీఎం భూపీందర్ హుడా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ తదితరులతో భేటీ అయ్యారు. జేజేపీ(జననాయక్ జనతా పార్టీ)తో చర్చలు జరుపుతూనే, స్వతంత్రులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్తో జేజేపీ కలిసి వచ్చినప్పటికీ మెజారిటీకి మరో ఐదుగురు సభ్యుల బలం అవసరం కావడంతో ఆ పార్టీకి అధికార ఏర్పాటు కొంచెం కష్టతరంగా మారింది. కాగా స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించారంటూ వస్తున్న వార్తలపై హుడా స్పందిస్తూ..‘వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారు. ప్రజా విశ్వాసాన్ని కాలరాస్తున్నారు. హరియాణా ప్రజలు వారిని ఎన్నటికీ క్షమించరు. వారిని చెప్పులతో కొట్టడం ఖాయం’అని మండిపడ్డారు.
(The above story first appeared on LatestLY on Oct 26, 2019 08:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

