Chief Justice of India: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే,  దేశంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా బొబ్డేకు గుర్తింపు
Justice SA Bobde took oath as the 47th CJI | Photo Credits; ANI

New Delhi, November 18: సుప్రీంకోర్ట్ 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే (Sharad Arvind Bobde) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind),  జస్టిస్ బొబ్డే చేత భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) గా ప్రమాణ స్వీకారం చేయించారు.

రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు హాజరయ్యారు.నేటి నుంచి ఏప్రిల్ 23, 2021 వరకు 18 నెలల పాటు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు.

 

Justice Sharad Arvind Bobde takes oath as the 47th Chief Justice of India

 

మహారాష్ట్రలో ఏప్రిల్ 24, 1956 న జన్మించిన జస్టిస్ బొబ్డే నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు.  19 ఏళ్ల క్రితం, 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా చేరారు. 2012 లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజె) అయ్యారు. ముంబైలోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్శిటీ మరియు నాగ్‌పూర్‌లోని ఎంఎన్‌ఎల్‌యు ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు.

ఏప్రిల్ 12, 2013న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోట్ కాబడిన బోబ్డే, చారిత్రాత్మక అయోధ్య భూ వివాద కేసును సుదీర్ఘకాలం విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరిగా ఉన్నారు.  జస్టిస్ బాబ్డే ప్రస్తుతం దేశంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. నిన్న ఆదివారం పదవీ విరమణ చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ తన వారసుడిగా గత అక్టోబర్ నెలలో జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే పేరును సీజేఐగా సిఫారసు చేశారు.