Heatwave Effect: మండుటెండ‌లో విద్యార్ధుల‌తో వ్యాయామం చేయించిన టీచ‌ర్! కుప్ప‌కూలిన 5వ త‌ర‌గ‌తి విద్యార్ధి, ఆస్ప‌త్రికి త‌ర‌లించేలోపే మృతి
Dead (Credits: X)

Rachi, May 03: మండుతున్న ఎండ‌లు (Heatwave) ఓ బాలుడి ప్రాణాలు తీశాయి. జార్ఖండ్ లోని రామ్ ఘ‌ర్ (Ramgarh) జిల్లా జారా బ‌స్తీకి చెందిన 11 ఏళ్ల బాలుడు స్కూళ్లో వ్యాయామం చేయడంతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. ఎండ‌లోనే విద్యార్ధుల‌తో ఫిజిక‌ల్ యాక్టివిటీ (physical activity) చేయించారు స్కూల్ సిబ్బంది. దీంతో తీవ్ర‌మైన ఎండ కార‌ణంగా 5వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఆర్య‌న్ కుమార్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. దీంతో జిల్లా ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ దీనిపై విచార‌ణ‌కు ఆదేశించారు. స్కూల్లో వ్యాయామం చేస్తుండ‌గానే విద్యార్ధి కుప్ప‌కూలాడ‌ని, అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించేలోపే మ‌ర‌ణించిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది.

 

ఘ‌ట‌న‌కు బాధ్యులైన స్కూల్ యాజ‌మాన్యంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో విచార‌ణ పూర్త‌యిన త‌ర్వాత త‌దుప‌రి యాక్ష‌న్ తీసుకుంటామ‌ని జిల్లా విద్యా అధికారి తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో జార్ఖండ్ వ్యాప్తంగా 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్ధుల‌కు హాలిడేస్ ప్ర‌క‌టించారు. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కు స్కూళ్లు తెర‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల‌కు మాత్రం మిన‌హాయింపు ఇచ్చారు.