![](https://test1.latestly.com/uploads/images/2025/01/union-cabinet-meeting-today.jpg?width=380&height=214)
New Delhi, FEB 15: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) ప్రకటించింది. ఈ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో (Central Government Employees) ఆనందం వెల్లివిరుస్తోంది. అప్పటి నుంచి ఉద్యోగులందరూ ఎప్పుడు అమలు చేస్తారా? ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే, 8వ వేతన సంఘం (8th Pay Commission) జనవరి 1, 2026 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రారంభం అవుతుంది. అయితే, ప్రభుత్వం ఇంకా వేతన కమిషన్కు సంబంధించిన నిబంధనలను జారీ చేయలేదు. అసలు ఇది ఎప్పుడు అమలు చేయనుందో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
8వ వేతన కమిషన్ను ముందుగానే ప్రకటించడంతో అమలుపై తగినంత సమయం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన సందర్భంగా పేర్కొన్నారు. ప్రతిపాదిత తేదీ నుంచే అమలు చేస్తారని అంచనా వేస్తున్నారు. కానీ, దీనికి సంబంధించిన ఎలాంటి నిబంధన ప్రభుత్వ పత్రంలో ప్రస్తావించలేదు.
దీంతో ఉద్యోగుల్లో కొంత నిరాశ నెలకొంది. 2025 బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు అనేక పథకాలు ప్రకటించారు. వేతన సంఘం ఖర్చుల గురించి కూడా ప్రస్తావించలేదు. 2026లో వేరే ఏదైనా నెలలోనైనా అమలు చేయగలదా? లేదా అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. కేంద్ర ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్ల జీతాలు, భత్యాలను సవరించేందుకు 8వ వేతన సంఘం సిఫార్సులను ఏర్పాటు చేశారు. జనవరి 1, 2026 నుంచి ఈ వేతన సంఘం అమలు అయ్యే అవకాశం లేదు. గతంలో 7వ వేతన సంఘం సిఫార్సులు 2016లో అమలు అయ్యాయి.
ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో భారీ పెరుగుదల కనిపించింది. అయితే, 8వ వేతన సంఘం అమలుకు సంబంధించి తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఈ కారణంగా, ఇది ఎప్పుడు అమలు అవుతుంది అనేది అధికారిక ప్రకటన లేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 8వ వేతన సంఘం ఏర్పాటుకు గత జనవరి 16న ఆమోదం తెలిపింది. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేళ్లను, పెన్షనర్ల భత్యాలను సమీక్షిస్తుంది. ఈ కమిషన్ సిఫార్సులు జీతాల నిర్మాణంలో పెద్ద మార్పులకు దారితీయవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈ కమిషన్ జీతాలలో భారీ పెరుగుదల ఉంటుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.08గా నిర్ణయిస్తే మాత్రం కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం రూ. 18వేల నుంచి రూ. 37,440కి పెరగవచ్చు. అదే సమయంలో, పెన్షన్ రూ. 9వేల నుంచి రూ. 18,720కి పెరగవచ్చు. కానీ, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86కి పెరిగితే, జీతం 186 శాతం పెరుగుతుంది. ఇదే జరిగితే, కనీస వేతనం రూ.51,480కి, పెన్షన్ రూ.25,740కి పెరగవచ్చు.