
Bengaluru, December 17: కర్ణాటక రాజధాని బెంగళూరులో సీఐడీ మహిళా డీఎస్పీగా (Deputy SP) పనిచేస్తున్న లక్ష్మీ(33) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారంరాత్రి 10.30 ప్రాంతంలో స్నేహితురాలి నివాసంలో ఆమె ఉరేసుకొని ఆత్మహత్య (CID Deputy SP Laxmi Dies by Suicide) చేసుకున్నారు.బెంగుళూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కోలార్ జిల్లాలోని మలూరు తాలుకా మాస్తి గ్రామానికి చెందిన లక్ష్మీ 2014లో కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన సీఐడీ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించారు. శిక్షణ అనంతరం ఆమె 2017లో ఉద్యోగంలో చేరారు.
ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగళూరులోని అన్నపూర్నేశ్వరి నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో డీఎస్పీగా పని చేస్తున్నారు. తన స్నేహితురాలు ఇంటికి విందుకు వెళ్లిన లక్ష్మి.. అక్కడ గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎంతకి లక్ష్మి బయటకు రాకపోవడంతో స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించగా వారు తలుపులు బద్దలు కొట్టడంతో ఉరివేసుకుని కనిపించారు. ఆమెను వెంటనే కిందికి దించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు.
కాగా, ఎనిమిదేళ్ల కిందట వివాహం చేసుకున్న లక్ష్మికి సంతానం కలగలేదు. సంతానం కలుగలేదన్న నిరాశతో లక్ష్మి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఆత్మహత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో కూడా దర్యాప్తు (Investigation Department) చేపడుతున్నారు.