Keonjhar Rape And Murder Case: 3 ఏళ్ల పాపపై అత్యాచారం, ఆపై హత్య, నిందితుడికి మరణ శిక్ష విధించిన ఒడిషా కోర్టు, నిందితుడికి వ్యతిరేకంగా ఆరు కేసులు నమోదు
(Representational photo) | Photo Credit: Getty Images

Keonjhar, December 20: దేశంలో మానవ మృగాలు వీర విహారం చేస్తున్నాయి. పసిపిల్లల దగ్గర నుంచి పండు మసలి వరకు ఎవర్నీ వదలడం లేదు. మద్యం మత్తులో వారేం చేస్తున్నారో అర్థం కాకుండా ఉన్మాద ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారికి కోర్టు ఉరిశిక్ష విధించినా, పోలీసులు ఎన్‌కౌంటర్లు చేసినా మార్పు రావడం లేదు. మొన్న దిశ ఘటనలో(Disha rape and murde case) పోలీసుల మీద ఎదురుదాడికి దిగిన నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ (Hyderabad Encounter)చేశారు.

తాజాగా మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడి, ఆపై హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం మరణ శిక్ష (Death Penalty) విధించింది. కెంజొహార్‌ జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. 2017వ సంవత్సరంలో సునీల్‌ నాయక్‌ అనే నిందితుడు(Sunil Kumar Naik) ఒడిషాలోని కెంజొహార్‌ జిల్లాలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద 28 సాక్షుల వివరణను పరిశీలించిన అనంతరం నిందితుడికి మరణ శిక్ష ఖరారు చేసినట్లు కెంజొహార్‌ జిల్లా అదనపు మేజిస్ట్రేట్‌ లోక్‌నాథ్‌ సాహు ( Additional District Court-cum Special Court Judge Lokanath Sahu) తెలిపారు.

కాగా నిందితుడు నన్ను అన్యాయంగా ఇరికించారని చెబుతున్నాడు. వాస్తవానికి ఈ కేసులో నాకు ఎటువంటి ప్రమేయం లేదు. దిగువ న్యాయ స్థానం తీర్పును సవాల్‌ చేసేందుకు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు నిందితుడు సునీల్‌ నాయక్‌ తెలిపాడు. 2017 వ సంవత్సరం జనవరి 13వ తేదీన నిందితుడు మూడేళ్ల బాలికను ఒంటరిగా తీసుకుని పోయి నిర్మానుష్య ప్రాంతంలో లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.

బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా బలవంతపు చర్య, షాక్‌తో చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన చంపువా స్టేషన్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడికి వ్యతిరేకంగా ఆరు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం విచారణ కొనసాగించిన అనంతరం నిందితుడికి మరణ శిక్ష విధించినట్లు ప్రభుత్వన్యాయవాది గణేష్‌ చంద్ర మహాపాత్రో తెలిపారు.