
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముందుగా తీవ్ర అల్పపీడనంగా మారి తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఇది వ్యాప్తి చెంది ఉంది. ఈ అల్పపీడనం.. తుఫానుగా మారితే 'అసని' అనే పేరుతో పిలుస్తారు. ఈ పేరును (Who named Cyclone Asani) శ్రీలంక పెట్టింది. శ్రీలంకలోని అధికారిక భాషలలో ఒకటైన సింహళంలో 'అసని' అంటే 'కోపం' అనే అర్థం (What does it mean) వస్తుంది.
అయితే 'అసని' తుఫాను ప్రభావం అంత భయంకరంగా ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నా.. అధిక తీవ్రత కలిగిన తుఫానుగా (Cyclone Asani) మారబోదని చెప్పారు. ఈ అల్పపీడనం మాయాబందర్ (అండమాన్ దీవులు)కి (Cyclone Asani set to hit Andamans) ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో, యాంగోన్ (మయన్మార్)కి నైరుతి దిశలో 530 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. వచ్చే 12 గంటల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల్లో ఇది ఉత్తర దిశగా మయన్మార్ తీరం వైపు పయనించనుందని పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున తాండ్వే (మయన్మార్) సమీపంలో తీరం దాటనుందని వెల్లడించింది.
ఉష్ణమండల తుఫానులకు పేరు పెట్టే వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆరింటిలో భారత వాతావరణ శాఖ కూడా ఒకటి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడే ఉష్ణమండల తుఫానులకు 13 సభ్య దేశాలు పేర్లు ప్రతిపాదించడానికి ఐఎండీ ఒక ప్రామాణిక విధానాన్ని అనుసరిస్తుంది. ఇండియాతో సహా బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయ్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్.. ఇప్పటికే పేర్లను ప్రతిపాదించాయి.



ఒక్కో దేశం 13 పేర్లు చొప్పున ప్రతిపాదించగా.. మొత్తం 169 పేర్లతో 2020లో జాబితాను రూపొందించారు. దేశాల పేర్లను అక్షర క్రమంలో ఉంచారు. వీటి ఆధారంగా ఆయా దేశాలు పెట్టిన పేర్లను వరుసగా తీసుకుంటారు. ఉదాహరణకు గతేడాది అక్టోబర్లో ఏర్పడిన తుఫానుకు ఖతార్ సూచించిన ‘షహీన్’ అని పేరు పెట్టారు. డిసెంబర్లో వచ్చిన తుఫానుకు సౌదీ అరేబియా సూచించిన ‘జవాద్’ పేరు పెట్టారు. అక్షర క్రమంలో సౌదీ తర్వాత ఉన్న శ్రీలంక వంతు ఇప్పుడు వచ్చింది. కాబట్టి శ్రీలంక సూచించిన 'అసని' పేరును తాజాగా వాడుతున్నారు.