Fuel Prices in India:  దేశంలో పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు,  హైదరాబాద్ మరియు ముంబై నగరాలలో రూ.80 దాటిన పెట్రోల్ ధర, వివిధ నగరాలలో ఈరోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి
File image used for representational purpose | (Photo Credits: Pixabay)

New Delhi, January 7:  అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కారణంగా, దేశీయంగా ఇంధన ధరలు (Fuel Prices)పెరిగాయి. ఈరోజు లీటరు పెట్రోల్ ధరపై  5 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుపై 11 పైసలు పెరిగింది. ఈ కొత్త ఏడాది మొదటి ఏడు రోజుల్లో, ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ ధరపై 60 పైసలు మరియు డీజిల్ ధరపై 83 పైసలు పెరిగింది. భారతదేశంలో ఇంధన ధరలు అంతర్జాతీయ ముడి చమురు (crude oil) రేట్లపై ఆధారపడి ఉన్నాయి.

ఒకవైపు యూఎస్- చైనా మధ్య వాణిజ్య ఒప్పందం, పెట్రోలియం ఎగుమతి చేసే దేశాలు (OPEC) మరియు దాని మిత్రదేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో కోతలు, మరోవైపు ఇరాన్- ఇరాక్ లపై యూఎస్ దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు. ఈ పరిణామాల ప్రభావం భారత్ పై నేరుగా పడుంది. ఈ నేపథ్యంలోనే ఇంధన ధరలు మరియు బంగారం ధరలు పెరుగుతున్నాయి. రాబోయే రాజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక ఈరోజు దేశంలోని వివిధ మెట్రో నగరాలలో పెట్రోల్- డీజిల్ ధరలను గమనిస్తే ఇలా ఉన్నాయి.

మెట్రో నగరం     పెట్రోల్ ధర/ లీ.   డీజిల్ ధర/ లీ.
న్యూ దిల్లీ    ₹ 75.74    ₹ 68.79
కోల్‌కతా     ₹ 78.33   ₹ 71.15
ముంబై     ₹81.33   ₹ 72.14
చెన్నై     ₹ 78.69    ₹ 72.69
బెంగళూరు      ₹ 78.28     ₹ 71.08
హైదరాబాద్‌       ₹ 80.54     ₹ 75.00

దేశంలో ఇంధన అవసరాల తీర్చడం కోసం భారతదేశం 84% విదేశీ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ప్రపంచ మార్కెట్లో ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని నివేదికలు తెలియజేస్తున్నాయి. దేశంలోని చమురు దిగుమతుల్లో మూడింట రెండు వంతులు మధ్యప్రాచ్యం వాటా ఉంది, ఇరాక్ మరియు సౌదీ అరేబియా మనదేశాని అగ్ర సరఫరాదారులుగా ఉన్నాయి.