Vaccination In India: భారత్‌లో సుమారు 45 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి, 97 శాతం లబ్దిదారులు టీకా పట్ల సంతృప్తి; గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,408 కరోనా కేసులు నమోదు
Representational Image | PTI Photo

New Delhi, February 5: భారత్‌లో కొవిడ్ నివారణ వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతోంది. జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి నేటికి 20 రోజులవుతోంది. ఈరోజు వరకు దేశవ్యాప్తంగా 49,59,445 టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే తొలి విడత వ్యాక్సినేషన్ పూర్తయి, రెండో విడత వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. విడతల వారీగా మరియు ప్రాధాన్యత క్రమంలో వివిధ వర్గాల వారికి టీకాల పంపిణీ చేయనున్నారు. ఇప్పటివరకు టీకా పొందిన వారిలో 97 శాతానికి పైగా టీకా పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని, వారిలో ఎలాంటి విపరీత లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నట్లు ఒక సర్వే పేర్కొంది.

మరోవైపు, దేశంలో కొవిడ్ కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 12,408 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 1,08,02,591కు చేరింది. నిన్న ఒక్కరోజే 120  కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,54,823కు పెరిగింది.

India's COVID Status Update:

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,853 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,04,96,308 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,51,460 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.16% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 1.40%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.43% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక ఫిబ్రవరి 4 వరకు దేశవ్యాప్తంగా 19,99,31,795 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 7,15,776 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.