Coronavirus in India: భారత్‌లో మొదలైన థర్డ్ వేవ్, ఒక్కరోజే 58వేల పాజిటివ్ కేసులు, భారీగా పెరిగిన యాక్టీవ్ కేసులు, 2వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు
Coronavirus Outbreak (Photo Credits: IANS)

New Delhi January 05: భారత్‌లో కరోనా (Corona) మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. ప్రతిరోజు వేలకొద్దీ కేసులు(Daily cases in India) పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్‌ విజృంభిస్తుండటంతో రోజువారీ కేసులు 58 వేలు దాటాయి. మంగళవారం నాటి కేసుల కంటే 55 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసులతోపాటు, మరణాలు, యాక్టివ్‌ కేసులు(Active cases) కూడా నానాటికి అధికమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 58,097 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 3,50,18,358కి చేరాయి. ఇందులో 3,43,21,803 మంది కోలుకున్నారు. మరో 2,14,004 కేసులు యాక్టివ్‌గా ఉండగా, ఇప్పటివరకు 4,82,551 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 15,389 మంది కరోనా నుంచి కోలుకోగా, 534 మంది మరణించారని(Corona deaths) కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక దేశవ్యాప్తంగా 147.72 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ (Corona vaccine)డోసులను పంపిణీ చేశామని తెలిపింది. పాజిటివిటీ రేటు 4.18 శాతానికి చేరిందని తెలిపింది. మహారాష్ట్ర(Maharashtra), న్యూఢిల్లీ, పశ్చిమబెంగాల్‌(West Bengal)లో రోజువారీ కరోనా కేసులు అధికమవుతుండటంతో దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్నది. వీటితోపాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌, తెలంగాణలో భారీగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 18,466 కేసులు, ఢిల్లీలో 5481, బెంగాల్‌లో 9073, కేరళలో 3640, తమిళనాడు 2731, కర్ణాటక 2476, గుజరాత్‌ 2265, రాజస్థాన్‌ 1137, తెలంగాణలో 1052, పంజాబ్‌లో 1027 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతున్నది. మొత్తం కేసులు 2135కు చేరాయి. ఇప్పటివరకు 828 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్‌ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 653, ఢిల్లీలో 464, కేరళ 185, రాజస్థాన్‌ 174, గుజరాత్‌ 154, తమిళనాడు 121 చొప్పున రికార్డయ్యాయి.