Madhya Pradesh: కాపురంలో చిచ్చుపెట్టిన టమాట! తనకు తెలియకుండా కూరలో టమాటా వేశాడని ఇళ్లు వదిలి వెళ్లిపోయిన భార్య, మిస్సింగ్ కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు
భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట (Tomato) వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక పోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Bhopal, July 13:పెరిగిన టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కేజీ టమాటా (Tomato) ధర రూ.200 చేరువలో ఉంది. దీంతో గృహిణులు ఆచితూచి టమటా వినియోగిస్తున్నారు. పలు చోట్ల టమాట చోరీలు, హత్యలు జరుగుతున్నాయి కూడా. తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చురేపింది. భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట (Tomato) వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక పోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇంతకీ ఎక్కడ జరిగిందంటే.. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో ధన్పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెమ్హోరి (Bemhuri) గ్రామానికి చెందిన సందీప్ బర్మన్ చిన్న దాబాను నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం కూరలు చేస్తున్న సమయంలో.. సందీప్ భార్యకు తెలియకుండా టమాటా వినియోగింగాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య కోపంతో చిన్న కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. భార్య తిరిగిరాకపోవడంతో చేసేదిలేక సందీప్ ధన్పురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
సందీప్ వద్ద అతని భార్య ఫోన్ నంబర్ తీసుకుని ట్రేస్ చేయగా..ఉమరియాలోని తన సోదరి ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి దంపతులిద్దరికీ సర్దిచెప్పి పంపించినట్లు ధన్పురి పోలీస్ స్టేషన్ ఇన్చార్జి సంజయ్ జైస్వాల్ తెలిపారు. పెరుగుతున్న టమాటా ధరలతో సామాన్యులే కాదు.. వారి బంధుత్వాలు కూడా దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు.
(The above story first appeared on LatestLY on Jul 13, 2023 10:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

