Maharashtra: స్వయంకృత అపరాధమేనా? మహారాష్ట్రలో కరోనా విజృంభన, ఒక్కరోజులోనే 1233 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 16,758 కు పెరిగిన కోవిడ్-19 బాధితుల సంఖ్య
Coronavirus in India (Photo Credits: PTI)

Mumbai, May 06: కరోనా ప్రభావంతో మహారాష్ట్రలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,233 పాజిటివ్ కేసులు మరియు 34 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో COVID-19 బాధితుల సంఖ్య 16,758 కు చేరింది. అలాగే ఈ అంటువ్యాధి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 651 కు పెరిగింది. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఎక్కువ భాగం ముంబై నగరం నుంచే ఉంటున్నాయి. మిగతావి పుణె, పింప్రి-చిన్చ్వాడ్ మరియు మాలెగావ్ మునిసిపల్ సంస్థల పరిధుల్లో నుంచి కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

ముంబైలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం నాటికి 10,527కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో ముంబై నగరంలో 769 కేసులు, 25 కరోనా మరణాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇక్కడి మురికివాడల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా చెప్పబడే ధారావిలో కేసుల సంఖ్య బుధవారం నాటికి 733కు చేరగా, ఇప్పటివరకు 21 మంది మరణించారు. ఈ ఒక్క మురికివాడలో ఒక్కచోటనే సుమారు 10 లక్షల మంది జనం నివసిస్తున్నట్లు అంచనా.

COVID19 status in Mumbai:

ఇంతటి భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కార్ మద్యం దుకాణాలను తెరిచింది. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనం తరలివచ్చి మద్యం దుకాణాల వద్ద బారులు తీరడంతో ఎట్టకేలకు కళ్లు తెరిచి మద్యం దుకాణాలు సహా అత్యవసరం కాని మిగతా అన్ని దుకాణాలను మూసివేయించింది.  ప్రపంచవ్యాప్తంగా 37 లక్షలు దాటిన కరోనా కేసులు, 2.60 లక్షల మరణాలు 

మహారాష్ట్రలో కరోనా విజృంభనకు పూర్తిగా రాష్ట్ర సర్కార్ అలసత్వమే కారణం అని చెప్పవచ్చు. ముంబైలో విపరీతమైన రద్దీ ఉంటుందని తెలిసిందే. దేశంలో అప్పటికీ విజృంభిస్తుంది. ముంబైకి సమీపంలోనే ఉన్న పుణెలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. అయినా ప్రభుత్వం తనకేమి పట్టనట్లుగా వ్యవహరించింది. చివరకు ముంబైలో కేసులు రోజురోజుకి రెట్టింపవుతున్నా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించేవరకు కూడా మహారాష్ట్ర సర్కార్ చేతులు ముడుచుకొని కూర్చుంది. ఇప్పుడు అనుభవిస్తుంది. ఈరోజు దేశంలో నమోదయిన మొత్తం కేసుల్లో సింహభాగం మహారాష్ట్రవే. ఇప్పట్లో అయితే ముంబైలో పరిస్థితులు అదుపులోకి వచ్చే పరిస్థితులు కనబడటం లేదు. కనీసం మహారాష్ట్రలో మిగతా చోట్ల వైరస్ వ్యాప్తి పెరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.