Ranjan Gogoi: సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
File image of Ranjan Gogoi (Photo Credits: IANS)

New Delhi, March 17: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (Former CJI) రంజన్ గొగోయిని (Ranjan Gogoi) రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభలో ఇటీవల పదవీకాలం ముగిసి ఖాళీ ఏర్పడిన సభ్యుల స్థానాలకు గాను ఒక స్థానానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 80లోని క్లాజ్ 1, మరియు సబ్ క్లాజ్ 'ఎ' లో తనకున్న అధికారాలను ఉపయోగిస్తూ రంజన్ గొగొయ్ ను రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేస్తున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇటీవల పదవీకాలం ముగించుకున్న కేటీఎస్ తులసీ స్థానంలో గొగొయ్ పార్లమెంట్ ఎగువ సభకు ఎంపికయ్యారు.

Copy of The Notification:

అక్టోబర్ 3, 2018 నుండి నవంబర్ 17, 2019 వరకు భారత 46 వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంజన్ గొగోయ్, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రామ్ జనభూమి- బాబ్రీ మసీదు లాంటి వివాదాస్పదమైన కేసులను పరిష్కరిస్తూ తుది తీర్పులను వెలువరించిన ఐదుగురు సభుల సుప్రీం ధర్మాసనానికి నేతృత్వం వహించారు. ఈ చారిత్రాత్మక తీర్పు జస్టిస్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గతేడాది నవంబర్ 9న వెలువరించింది. ఆ తర్వాత గొగొయ్ పదవీ విరమణ పొందారు.

మహిళలకు శబరిమలలో ప్రవేశం, రఫేల్ ఒప్పందం లాంటి కీలక కేసులను విచారించే ధర్మాసనానికి కూడా రంజన్ గొగొయ్ నేతృత్వం వహించారు.