SBI Hikes Lending Rate: ఈఎంఐ చెల్లించేవారికి ఇక భారమే, ఎంసీఎల్‌ఆర్‌ మరోసారి పెంచిన ఎస్‌బీఐ, నెలరోజుల వ్యవధిలో రెండో సారి, తాజా రేటు పెంపు మే 15 నుంచి అమల్లోకి
SBI (Photo Credits: PTI)

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి యూజర్లకు ఝలక్ ఇచ్చింది. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) పది బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) వరకూ (10 Basis Points or 0.1%) పెరిగింది. అన్ని కాలపరిమితులకు తాజా పెంపు వర్తిస్తుందని బ్యాంక్‌ తెలిపింది. దీనితో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన రుణాలకు సంబంధించి నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) భారం వినియోగదారులపై (Go Up for Borrowers) పెరగనుంది. నెలరోజుల వ్యవధిలో బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ (SBI Hikes Lending Rate) పెరగడం ఇది రెండవసారి .

ఇప్పటికే బ్యాంక్‌ 10 బేసిస్‌ పాయింట్ల ఎంసీఎల్‌ఆర్‌ను పెంచింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఈ నెల ప్రారంభంలో అనూహ్యంగా 40 బేసిస్‌ పాయింట్లు (4 శాతం నుంచి 4.4%కి) పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ, స్థిర డిపాజిట్‌ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ తాజా రెండవ దఫా రేటు పెంపుతో ఇదే బాటలో పలు బ్యాంకులు రెండవ రౌండ్‌ రేట్ల పెంపు దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఖాతాదారులకు ఎస్‌బీఐ గట్టి షాక్‌, ఎంసీఎల్‌ఆర్‌ రేటు 10 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం, మరో 0.10 శాతం పెరగనున్న వడ్డీ రేట్లు

ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం, తాజా రేటు పెంపు మే 15 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం, ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెరిగింది. పలు రుణాలు ఈ కాల పరిమితికి అనుసంధానమై ఉంటాయి. ఓవర్‌నైట్, నెల, 3 నెలల ఎంసీఎల్‌ఆర్‌ 10 బేసిస్‌ పాయింట్లు పెరిగి 6.85%కి చేరింది. రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 0.1 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది.మూడేళ్ల రేటు 7.50 శాతానికి ఎగసింది. కాగా, ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్‌ఆర్‌) ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) 6.25 శాతంగా ఉంది. గృహ, ఆటో లోన్‌లతో సహా ఏ లోన్‌ను మంజూరు సమయంలోనైనా బ్యాంకులు ఈబీఎల్‌ఆర్, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌కు క్రెడిట్‌ రిస్క్‌ ప్రీమియం (సీఆర్‌పీ)ను కలుపుతాయి.