NSA Invoked Against Jamaat Members: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ సంచలన నిర్ణయం, విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసిన తబ్లిఘి జమాత్ కార్యకర్తలపై కఠినమైన ఎన్ఎస్ఎ చట్టం ప్రయోగం
Uttar Pradesh CM Yogi Adityanath | File Image | (Photo Credits: PTI)

Lucknow, April 3: ఉత్తరప్రదేశ్  (Uttar Pradesh) రాష్ట్రంలోని ఘజియాబాద్ క్వారంటైన్ కేంద్రంలో విధుల్లో నర్సులపై అసభ్యకరమైన హావభావాలు ప్రదర్శించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తబ్లిఘి జమాత్ సభ్యులపై (Tablighi Jamaat Members)  సీఎం యోగి ఆదిత్య నాథ్ (CM Yogi Adityanath) నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన జాతీయ భద్రతా చట్టం (NSA) ను చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

వివరాల్లోకి వెళ్తే, దేశంలో ప్రస్తుతం కోవిడ్-19 వ్యాప్తికి కారణం నిజాముద్దీన్ లోని మర్కజ్ లో తబ్లిఘి జమాత్ సభ్యుల నిర్లక్ష్య ధోరణే కారణం అని స్పష్టమైన విషయం తెలిసిందే. దీంతో తబ్లిఘి జమాత్ లో పాల్గొన్న సభ్యులను, వారితో కలిసిన వారిని ఎక్కడికక్కడ గుర్తించి అధికారులు వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి కోసం వస్తున్న పోలీసు సిబ్బందిపై మరియు ఇతర హెల్త్ అధికారులపై తబ్లిఘి జమాత్ సభ్యులు దాడి చేసిన ఘటనలు దేశంలో అక్కడక్కడ వెలుగు చూసిన విషయం తెలిసిందే.

దీనికి తోడు ఘజియాబాద్ క్వారంటైన్ కేంద్రంలో నిర్బంధంలో ఉన్న తబ్లిఘి జమాత్ సభ్యులు కొంతమంది తాము కోరిన ఆహారం పెట్టడం లేదని, సిగరెట్స్ లాంటివి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేస్తూ అక్కడ విధుల్లో ఉన్న అధికారులతో, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని తెలిసింది. అంతేకాకుండా నర్సులను చూస్తూ కూడా ఒంటిపై బట్టలు తొలగించుకొని వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు యూపీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై సీరియస్ గా రియాక్టయిన సీఎం యోగి ఆదిత్య నాథ్ కఠినమైన ఎన్‌ఎస్‌ఏ (National Security Act) చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు.

"వారు చట్టాలను గౌరవించరు, ఏ నిబంధనలను పాటించరు. ఇలాంటి వారు మానవత్వానికే శత్రువులు. స్త్రీ పట్ల వీరు చూపిన ప్రవర్తన క్షమించలేని నేరం. ఇక ఉపేక్షించలేం, వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేస్తాము" అని యోగి తీవ్రస్థాయిలో స్పందించారు.

ఈ క్రమంలోనే 6 నిందితులపై ఎన్‌ఎస్‌ఏ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. తబ్లిఘి జమాత్‌కు హాజరైన విదేశీయుల వీసాల రద్దు, బ్లాక్‌లిస్ట్. అందరిపై చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఆదేశం

ఎన్‌ఎస్‌ఏ చట్టం ముఖ్యంగా దేశ భద్రతకు భంగం వాటిల్లుతున్న సందర్భంలో లేదా ఇతర దేశాలతో సత్సంబంధాలు చెడగొట్టే సందర్భంలో ప్రయోగించే కఠినమైన చట్టం ఇందుకు విదేశీయులైనా మినహాయింపు ఉండదు. ముఖ్యంగా ఉగ్రవాదులపై ఇలాంటి చట్టాలతో కేసులు నమోదు చేస్తారు.

ఒకసారి ఎవరిపైనైనా ఎన్‌ఎస్‌ఏ చట్టం ప్రయోగిస్తే, ఎలాంటి కారణం చెప్పకుండానే వారిని అరెస్ట్ చేసి 12 నెలల పాటు జైలులో ఉంచవచ్చు అంతేకాకుండా వీరికి న్యాయపరమైన అవకాశాలు తక్కువే. ఎన్‌ఎస్‌ఏ చట్టం కింద అరెస్ట్ అయిన నిందితుడు హైకోర్టును ఆశ్రయించవచ్చు, అయితే వారి తరఫున న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉండదు. అంతేకాదు, ఎన్‌ఎస్‌ఏ చట్టం కింద గరిష్టంగా దేశ బహిష్కరణ శిక్ష కూడా విధించవచ్చు.