Save Sujith Wilson: అధికారుల నిర్లక్ష్యానికి చావు బతుకుల్లో రెండేళ్ల బాలుడు, ఆడుకుంటూ 25 అడుగుల బోరు బావిలో పడిన సుజిత్ విల్సన్‌, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సిబ్బంది
Two-year-old boy falls into abandoned borewell in Tamil Nadu (Pho0-ANI)

TIRUCHI, October 26: తమిళనాడు తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఓ రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదున్నర సమయంలో సుజిత్ విల్సన్‌ బోరు బావిలో పడిపోయాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి సమీపంలో ఆడుకుంటూ రెండేళ్ల బాలుడు సుజిత్‌ విల్సన్‌ 25 అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డాడు. కాగా పిల్లాడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గమనించారు. బోరుబావిలో నుంచి ఏడుపు వినిపించడంతో అనుమానంతో అధికారులకు సమాచారమిచ్చారు.

దీంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వచ్చిన అధికారులు బోరుబావిలో 25 అడుగుల కింద బాలుడు ఉన్నట్టు గుర్తించారు. రక్షించేందుకు మధురై నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మనప్పారై, సేలం, నమక్కల్‌ నుంచి ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.

బోరుబావిలో బాలుడు

స్థానికుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోరుబావికి సమాంతరంగా తవ్వుతున్నప్పటికీ బండ రాయి తగలడంతో తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో మధురై నుంచి ప్రత్యేక యంత్రాన్ని తెప్పించారు. ఇప్పటికీ 14 గంటలు దాటిందని బాలుడు ఏడుపు వినిపిస్తోందంటూ అధికారులు చెబుతున్నారు.

కాగా బాలుడికి నిరంతరాయంగా ఆక్సీజన్ అందిస్తున్నామంటూ ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ తెలిపారు. అయితే ఏడేళ్ల క్రితం ఈ బోరు బావిని తవ్వి వదిలేశారు. కన్న కొడుకుని ప్రాణాలతో బయటకు తీయమంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తున్నారు.