Electoral Reforms: ఓటర్ ఐడీకి ఆధార్‌ లింక్, ఏడాదికి నాలుగుసార్లు కొత్త ఓటర్ల నమోదు, కీలక బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర, బోగస్ ఓట్ల ఏరివేతే లక్ష్యంగా నిర్ణయం
No more relationship column in Aadhar Reports (Photo-Wikimedia Commons)

New Delhi December 15:  బోగస్ ఓట్ల(Bogus Votes) నిర్మూలన కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ లింక్(link electoral roll with Aadhaar ) కు సంబంధించి కీలక బిల్లుకు కేంద్ర కేబినెట్(Central Cabinet) ఆమోదం తెలిపింది. దీంతో పాటూ మరిన్ని కీలక సంస్కరణలకు సంబంధించిన బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్ ప్రక్రియను(Voting) మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటూ బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలను తీసుకువచ్చింది కేంద్రం. ఈ బిల్లుకు సెంట్రల్ కేబినెట్ ఆమోదం(Central Cabinet) తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది.

పాన్-ఆధార్ లింక్(Pan Aadhar Link) చేసినట్లు గానే, ఓటర్‌ ఐడీ లేదా ఎలక్టోరల్‌ కార్డుతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని వ్యక్తుల స్వచ్ఛంద ప్రాతిపదికన ఈ ప్రక్రియను చేపట్టే అవకాశముంది. ఇక కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకొనేవారికి ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్‌ ఓకే చెప్పింది. ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు. అలాగే ఏడాదిలో నాలుగుసార్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకొనే వెసులుబాటు కలగనుంది. ఇందుకోసం ఏటా నాలుగు వేర్వేరు కటాఫ్‌ తేదీలు కేటాయిస్తారు. ఇప్పటివరకు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది.

దీంతో పాటూ రక్షణ సిబ్బంది ఓటు వేసే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసు అధికారుల విషయంలో గతంలో ఉన్న నిబంధనల్ని సడలించింది. దంపతులిద్దరూ ఓటు హక్కు వినియోగించుకొనేలా బిల్లులో మార్పులు చేసింది. ఎన్నికలు నిర్వహించే ప్రాంగణాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికే పూర్తి అధికారాలు అప్పగిస్తూ మరో సవరణ చేసినట్టు తెలుస్తోంది.