Rahul Gandhi in Parliament: మీ విధానాల వల్ల చైనా, పాకిస్తాన్ నుంచి ముప్పు! కేంద్రంపై రాహుల్ ఫైర్, నిరుద్యోగంపై రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనే లేదు, లోక్‌సభలో మోడీ సర్కారుపై రాహుల్ ధ్వజం

New Delhi, Feb 02: దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). గత 50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా (Corona)సమయంలో 84శాతం కుటుంబాలు తమ ఆదాయాన్ని(Lost Income) కోల్పోయాయన్నారు. లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలారని అన్నారు. పార్లమెంట్(Parliament) లో రాష్ట్రపతి ప్రసంగానికి (presidential address) ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. మోదీ ప్రభుత్వం (Modi Government) పేదవారి పొట్టకొట్టి ధనికులకు పంచిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక భారత్‌ భద్రత తీవ్ర ప్రమాదంతో ఉందన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). భారత్‌కు వ్యతిరేకంగా చైనా, పాక్‌లు ఆయుధాలను పోగేసుకుంటున్నాయన్నారు. భారత్‌ను ఎదుర్కోవడంలో చైనాకు పక్కా ప్రణాళిక ఉందని చెప్పారు. మన విదేశీ విధానంలో తీవ్ర లోపం కనిపిస్తోందని, డోక్లాం (Doklam), లద్దాఖ్‌(Ladakh) విషయంలో లోపాలు తేటతెల్లమయ్యాయన్నారు. సరిహద్దు లోపల, వెలుపల ఇదే పరిస్థితి నెలకొందని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

మోదీ ప్రభుత్వం పేదవారి పొట్టకొట్టి ధనికులకు పంచిపెడుతోందన్నారు రాహుల్. లక్షల మందికి ఉద్యోగాలు లేవు. యూపీఏ హయాంలో 27కోట్ల మంది పేదరికం నుంచి గట్టేక్కారు. కానీ మోదీ హయాంలో మాత్రం 23కోట్ల మంది తిరిగి పేదరికంలోకి వెళ్లారు. కేవలం గతేడాదిలోనే 3కోట్ల ఉద్యోగాలు పోయాయి. కరోనా సమయంలో 84శాతం కుటుంబాలు తమ ఆదాయాన్ని కోల్పోయాయి. కొవిడ్‌తో కుదేలైన చిన్న పరిశ్రమలకు మద్దతు లేదు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇలా దేశంలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్రపతి మాత్రం తన ప్రసంగంలో నిరుద్యోగం వంటి కీలక విషయాలను ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుతం దేశంలో రెండు భారత్‌లు ఉన్నాయన్న ఆయన.. ఒకటి ధనికులది, మరొకటి పేదల భారత్‌ అంటూ అభివర్ణించారు. ఈ రెండింటి మధ్య అంతరం క్రమంగా పెరుగుతోందని రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.