MAHA Govt Formation Deadline: క్లైమాక్స్‌లో మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్, సోమవారంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు రావాలన్న గవర్నర్, బీజేపీ-శివసేన మధ్య తేలని పంచాయితీ, సీఎం కుర్చీపై కూర్చునేదెవరు ?
Devendra Fadnavis and Uddhav Thackeray (Photo-PTI)

Mumbai, November 10: దేశ వ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎంతో ఆసక్తిని రేకెత్తించగా, ఇప్పుడు అక్కడ ప్రభుత్వ ఏర్పాటు (Maharashtra Govt Formation) అంతకన్నా ఆసక్తిగా మారింది. సీఎం సీటులో ఎవరు కూర్చుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ (BJP) దాని మిత్ర పక్షం శివసేన(Shiv Sena)ల మధ్య సీఎం సీటు విషయంలో ఇంకా పంచాయితీ నడుస్తూనే ఉంది. శివసేన 50-50 ఫార్ములాకి పట్టుబడుతుండగా బీజేపీ దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది.

ఇదిలా ఉంటే సోమవారం బల నిరూపణ చేసుకోవాలని.. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ (Maharashtra Governor Bhagat Singh Koshyari )డెడ్ లైన్ విధించారు. ఇప్పటికే.. 105 సీట్లు సాధించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దానికి అవసరమైన బలాన్ని నిరూపించుకోవాలని ఆపద్ధర్మ సీఎం ఫడ్నవిస్‌ను గవర్నర్ ఆహ్వానించారు. 2019, నవంబర్ 11వ తేదీ సోమవారం బలనిరూపణ చేసుకోవాలని తెలిపారు.

వాస్తవానికి మహారాష్ట్ర(Maharashtra)లో ప్రభుత్వ ఏర్పాటుకు 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారంతో గడువు ముగిసింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ కోశ్యారీ గడువును సోమవారానికి పొడిగించారు.

కాగా మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మేజిక్ ఫిగర్ 145. బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44, ఇతర పార్టీలకు 29 సీట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన శివసేన సీఎం పదవి తమకు కావాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు బీజేపీ ఒప్పుకోవడం లేదు. దీంతో.. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోంది.

మరోవైపు.. శివసేనకు మద్దతిచ్చేది లేదని.. ఎన్సీపీ(NCP), కాంగ్రెస్(Congress) తేల్చి చెప్పేశాయి. ఇది కూడా మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభనకు కారణమైంది. సోమవారం లోపు.. ఎవరు తమ బలం నిరూపించుకుంటారన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.