Modi Sarkar's Next Move: సంవత్సరాల కొద్దీ సాగదీసే చర్చలు లేవు, మైండ్‌లో ఫిక్స్ అయితే... బ్లైండ్‌గా వెళ్లిపోవడమే! మోడీ టీమ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

సాహాసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ సంచనాలకు మారుపేరుగా నిలుస్తుంది మోడీ సర్కార్. గత టర్మ్ లో నోట్ల రద్దు, పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ ఇలా చేసుకుంటూ పోయింది. ఇప్పుడు మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత, మోడీ టీంలోకి అమిత్ షా ప్రత్యక్షంగా ఎంటర్ అయిన తర్వాత ఆ దూకుడు మరింత పెరిగింది. వివాదాస్పదం, సున్నిత అంశం అనే లెక్కలు ఏం లేవు, వరుసపెట్టి కీలక బిల్లులను పార్లమెంట్ సాక్షిగా తాడోపేడో అన్నట్లుగా తేల్చిపారేస్తుంది.

మొన్నటికి మొన్న ట్రిపుల్ తలాక్ రద్దు, ఇప్పుడు కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం. ఇలా ఏ అంశాలు తీసుకున్నా సరే, మోడీ సర్కార్ మైండ్ లో ఫిక్స్ అయిందంటే, బ్లైండ్ గా వెళ్లిపోతుంది. ముందువెనకా ఆలోచనలు, సాగదీసే చర్చలు ఏం లేవు. ఏమైనా జరగనీ, అనుకున్నపని మాత్రం పూర్తికావాలి అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నారు మోడీ- షా ద్వయం.

అయితే, తదుపరి మోడీ ప్రభుత్వం ఇంకా ఏం చేయబోతుందోనని అందరిలో ఆసక్తి మొదలైంది. ఇక మిగిలింది, బీజేపీ నాయకులు ఎక్కువగా ప్రస్తావించే అయోధ్యలో రామమందిర నిర్మాణం మరియు ఆర్టికల్ 370ని రద్దు చేసి భారతదేశం మొత్తంగా హిందుత్వం ఎజెండాగా ఏకీకృత పౌర స్మృతి Uniform Civil Code (UCC) ను కల్పించడం. ఈ రెండు ప్రధానాంశాలను బీజెపీ- సంఘ్ పరివార్ దశాబ్దాలుగా చెప్తూ వస్తున్నాయి, తాము అధికారంలోకి వస్తే వీటిని వెంటనే అమలు చేస్తామని. అయితే అధికారంలో ఉండి కూడా గత టర్మ్ లో చేయలేకపోయినా ఈ సారి ఖచ్చితంగా ఆ దిశగా ముందడుగు పడుతుందని పలు వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయోధ్యలో రామమందిరం అంశంపై ప్రస్తుతం (మంగళవారం, ఆగష్టు 06- 2019) సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉంటే మోడీ సర్కార్ దూకుడుకు ప్రత్యర్థి పార్టీలు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, వంద ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో చిక్కుకొని విలవిలలాడుతుంది. ఎలా అంటే మతం రంగు పులుముకున్న బీజేపీ, 'దేశం' అనే కాన్సెప్ట్ లో వెళ్తుంటే, తాము సెక్యులర్ గా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకునే క్రమంలో దేశంలోని మెజారిటీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ తన ఉచ్చుతానే బిగించుకున్నంత పనిచేస్తుంది. బీజేపీని 'హిందుత్వ' పార్టీగా ముద్రవేసి వ్యతిరేకించే ప్రత్యర్థి పార్టీలన్నీ , బీజేపి 'దేశం' కాన్సెప్ట్ కి తిరిగి ఆ పార్టీ దారిలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బీజేపీ గనుక ఇదే ధోరణితో దూసుకెళ్తూ పోతే రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీలు వారివారి రాష్ట్రాల్లో కూడా నిలదొక్కుకునే పరిస్థితి ఉండదు.ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో. ప్రస్తుతం సౌత్ లో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఇకపై బీజేపీపై ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తాయి అనేదానిపైనే వాటి భవితవ్యం ఆధారపడి ఉంది.