ఆ బర్రె అలాంటి ఇలాంటి బర్రె (Buffalo) కాదు. బర్రె జాతిలో ఆణిముత్యం, మిగతా బర్రెలన్నింటికీ ఆదర్శం. ఇంతకీ అదేం చేసిందంటే, ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో ఉన్న భారతీయ రైల్వే వారి రైలులో ప్రయాణించి గమ్యస్థానం చేరింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా (Kolkata) లోకల్ ట్రైనులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, కోల్కతా శివార్లలోని సీల్దా మరియు డైమండ్ హార్బర్ మధ్య నడిచే '34828' నెంబర్ లోకల్ ట్రైను (Local Train) లో ఒక బర్రె ప్రయాణించడం తోటి ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. బంగారం మేసిన ఎద్దు, పేడ కోసం యజమానుల ఎదురుచూపులు
రైలు కదిలేటపుడు అందరు ప్రయాణికులతో పాటు అది ఎక్కింది. నల్లగా, నిగనిగలాడుతూ ఉన్న ఆ బర్రె ఎలాంటి అదురు బెదురు లేకుండా క్రమశిక్షణతో అందరిలాగే ఓ సామాన్య ప్రయాణికురాలిగా ప్రయాణించడం మిగతా ప్రయాణికులకు చూడముచ్చటగా అనిపించింది. దీంతో ఓ ప్రయాణికుడు దాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.
ఆ వీడియో మీరూ చూసేయండి.
ఆ బర్రె సీల్దా నుంచి డైమండ్ హార్బర్ వరకు సుమారు 54 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెబుతున్నారు. అయితే ఆ బర్రె పొరపాటున రైలు ఎక్కిందా? లేదా అంతదూరం తరలించడానికి ఖర్చులకు భయపడిన దాని యజమాని గుట్టుచప్పుడు కాకుండా ఈ రకమైన ప్రయత్నాం చేశాడా అనే అనుమానాలు, అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అది టికెట్ తీసుకుందా లేదా? అని మరికొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీగా కమెంట్స్ రాస్తున్నారు.