T20 World Cup: పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్‌కు చికిత్స అందించిన భారతీయ డాక్టర్, సెమీఫైనల్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రిజ్వాన్..
Mohammad Rizwan In ICU (Photo-Twitter/Shoaib Akhtar)

T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌ లో చెలరేగి ఆడిన పాకిస్తానీ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్‌ మ్యాచుకు ముందు పరిస్థితి చాలా విషమంగా మారిందని సాక్షాత్తూ ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం చెప్పుకొచ్చాడు. అంతేకాదు రిజ్వాన్ తీవ్రమైన చాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఐసీయూలో చికిత్స పొంది, మళ్లీ బ్యాటు పట్టుకొని మైదానంలో దిగడమే కాదు ఆస్ట్రేలియాపై అర్థశతకం బాది తన సత్తా చాటాడు. అయితే రిజ్వాన్ ఇంత త్వరగా కోలుకోవడం వెనుక ఓ భారత వైద్యుడి సాయం ఉందని తేలింది.  ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేరిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిజ్వాన్ ను మేడోర్ ఆసుపత్రి వైద్యుడు షహీర్ సనల్‌బాదిన్ చికిత్స చేశాడు.

ఐసీయూలో తనకు చికిత్స అందిస్తున్న వైద్యులతో రిజ్వాన్ నిరంతరం మాట్లాడుతూ, "తనకు ఆడాలని ఉందని. జట్టుతో కలిసి ఉండాలని ఉందని కాంక్షించినట్లు వైద్యులు తెలిపారు. రిజ్వాన్‌కు చికిత్స అందించిన షహీర్ మాట్లాడుతూ ఈ ముఖ్యమైన నాకౌట్ మ్యాచ్‌లో ఆడేందుకు రిజ్వాన్ ఆసక్తిగా ఉన్నాడని. అతను నిబద్ధతతో , ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అతను ఇంత త్వరగా కోలుకోవడం తనను ఆశ్చర్యపరిచింది" అని చెప్పాడు.

సెమీ ఫైనల్‌లో రిజ్వాన్ 67 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు

ఐసీసీ టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ హీరో. అతను 52 బంతుల్లో 67 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, అతని అద్భుతమైన ఇన్నింగ్స్ జట్టుకు పని చేయకపోవడంతో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టోర్నీలోని ఆరు మ్యాచ్‌లలో 281 పరుగులు చేశాడు, అందులో అతను మూడు అర్ధ సెంచరీలు చేశాడు. ఈ మెగా ఈవెంట్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన అజేయంగా 79, అతను భారత్‌పై చేశాడు.