AP Corona Updates: ఏపీలో 13 లక్షలు దాటిన కరోనా టెస్టులు, తెనాలి ఎమ్మెల్యేకి కోవిడ్-19, లాక్‌డౌన్ ప్రకటించిన షార్‌, మానవత్వాన్ని మింగేస్తోన్న కరోనావైరస్
COVID-19 Outbreak in India | File Photo

Amaravati, July 20: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు (AP Coronavirus Tests) 13 లక్షల మార్కును అధిగమించాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 31,148 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షల సంఖ్య 13,15,532కి చేరింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం (Srihari kota SHAR) లాక్‌డౌన్‌ను ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు షార్ లాక్‌డౌన్ (SHAR Lockdown) కొనసాగనుంది. వాటర్, కరెంట్, ఫైర్ అవసరాలు మినహా అన్ని సేవలు బంద్‌కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 50 వేలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య

ఇదిలా ఉంటే లాక్‌డౌన్ ప్రకటించిన తూర్పు గోదావరి, కర్నూలు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల్లోనూ భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నాలుగు వేలు దాటాయి. నిన్న ఒక్కరోజే 405 కేసులు నమోదు అయ్యాయి. ఏలూరులో 172 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,312కు చేరింది. ఏలూరులో మొత్తం కేసుల సంఖ్య 2,167గా నమోదు అయ్యింది. తరువాతి స్థానాల్లో భీమవరం 285, నరసాపురం 237 ఉన్నాయి. అరగంటలోనే కరోనా టెస్ట్ ఫలితం, ఏపీలో సిద్ధమైన సంజీవని వాహనాలు, అన్ని జిల్లాలకు అందుబాటులో.., ప్రారంభించిన పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రకాశం జిల్లాలో తాజాగా మరో 190 కరోనా పాజిటివ్ కేసులు (AP Coronavirus Cases) నమోదు అయ్యాయి. దీంతో జిల్లావ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2644కు చేరింది. జిల్లాలో ఇప్పటి వరకు 37 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 147 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని 1883 డిశ్చార్జ్ అయ్యారు. కరోనా లక్షణాలు లేకుండా పొజిటివ్ వచ్చిన 40 మందికి హోం ఐసోలేషన్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు. జిల్లాలో ప్రస్తుతం 721 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గుంటూరు జిల్లాలో శనివారం నుంచి లాక్‌డౌన్ (Guntur Lockdown) కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఒక్క జిల్లాలోనే 4,544 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెనాలి, నరసరావు పేట, గుంటూరు, సత్తెనపల్లి, గురజాల, పొన్నూరు వంటి ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. సంగం డైయిరీ డైరెక్టర్ పోపూరి కృష్ణారావు కరోనాతో మృతి చెందారు. కరోనా బారిన పడిన ఆయన కొద్ది రోజులుగా ఎఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈరోజు మృతి చెందారు.

కరోనా మానవత్వాన్ని మింగేస్తోంది. వైరస్‌ సోకి మరణిస్తే సొంత బంధువులు సైతం వణికిపోతున్న ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. 55 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఐసోలేషన్‌కు వెళ్లే నిమిత్తం ఇంటివద్ద సిద్ధంగా ఉండాలని గ్రామ వలంటీర్‌ సూచించాడు. ఈలోగానే ఆస్పత్రిలో చేరాలని సొంత కుటుంబసభ్యులు, బంధువులతో ఆదివారం రోడ్డుపైకి వచ్చిన అతను కుప్పకూలి మరణించాడు. దీంతో భయపడిన బంధువులంతా అక్కడినుంచి పారిపోయారు. మూడు గంటలకు పైగా మృతదేహం రోడ్డుపైనే ఉండిపోయింది. చివరకు స్థానిక వైఎస్సార్‌సీపీ నేత చల్లంచర్ల సాంబశివరావు స్పందించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో మున్సిపల్‌ సిబ్బంది మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను వదలట్లేదు కరోనా వైరస్. ఇదివరకే విజయనగరం జిల్లా శృంగవరపు కోట, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. అలాగే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కరోనా బారిన పడ్డారు. బియ్యపు మధుసూధన్ రెడ్డి భార్యకు కూడా వైరస్ సోకింది. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ (Tenali MLA Sivkumar Tested Corona Positive) కరోనా వైరస్ బారిన పడ్డారు.

కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన ఆయనకు వైద్యపరీక్షలను నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనితో అన్నాబత్తుని హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఐసొలేషన్‌లో ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. వాటికి సంబంధించిన నివేదికలు ఇంకా అందాల్సి ఉంది. అయినప్పటికీ.. ముందుజాగ్రత్తగా అన్నాబత్తుని కుటుంబ సభ్యులు హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. చికిత్స తీసుకుంటున్నారు.

కరోనా బారిన పడిన శ్రీవారి ఆలయ అర్చకులు (Priests of Srivari Temple) కోలుకుంటున్నారు. ఈ నెల 8న నలుగురు అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ముగ్గురు అర్చకులు కోలుకోవడంతో వైద్యులు వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అర్చకులకు వైద్యులు సూచించారు. దీంతో కోవిడ్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న అర్చకుల సంఖ్య 14కు చేరుకుంది. చెన్నై అపోలో ఆస్పత్రిలో మరో అర్చకుడు చికిత్స పొందుతున్నారు. ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్సను అందజేస్తున్నారు. అర్చకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.