Cyclone Mocha: ఏపీకి మోచా తుపాను ముప్పు తప్పినా సెగలు పుట్టించనున్న ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం
దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది.
దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. అనంతరం తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 10 నాటికి తుపానుగా బలపడనుంది. ఆపై ఈ తుపాను మొదట్లో 11వ తేదీ వరకు ఉత్తర, వాయవ్య దిశగా కదులుతుంది.
ఆ తర్వాత మలుపు తిరిగి మరింత బలపడి ఉత్తర, ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం రాత్రి బులెటిన్లో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్పై తుపాను ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. అయితే బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.
అయితే ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలకు బదులు ఎండలు విజృంభించనున్నాయి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. ఫలితంగా రాష్ట్రంలో మళ్లీ సెగలు మొదలు కానున్నాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఉపరితల ద్రోణి, అల్పపీడనంతో అనుసంధానమై ఉంది. ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
(The above story first appeared on LatestLY on May 09, 2023 01:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

