Justice Ahsanuddin Amanullah: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా, రేపు తెలంగాణహైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర ప్రమాణ స్వీకారం
AP High Court (Photo-Twitter)

Amaravati, Oct 10: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా (Justice Ahsanuddin Amanullah) ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ( Andhra Pradesh High Court) లోని మొదటి కోర్టు హాల్లో పాట్నా హైకోర్టు నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లాచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, పలువురు రిజిస్ట్రార్‌లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటిదాకా ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఏకే గోస్వామి ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. బదిలీపై ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు వెళుతున్న ఆయనకు సహచర న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయవృత్తి టీ20 అంత సులభం కాదని టెస్టు క్రికెట్‌లా సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడే ఓపిక ఉండాలని ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి అన్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న చాలా మందికి వాళ్ల హక్కుల గురించి తెలియని పరిస్థితి ఉందన్నారు. వారికి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని.. ఇందుకు యువ న్యాయవాదులు చొరవ తీసుకోవాలని సీజే సూచించారు. హక్కుల ఆవశ్యకతపై అవగాహన కల్పించకపోవడమూ పెద్ద నేరమే అని ఆయన తెలిపారు.

ఏపీలో ఇంధన సంక్షోభం, విద్యుత్‌ ధరలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలతో ఒప్పందాలను వాడుకోలేని స్థితిలో ఉన్నామని లేఖలో వెల్లడి

రేపు తెలంగాణహైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో నూతన సీజే ఎస్‌సీ శర్మతో ప్రమాణం చేయించనున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. దీంతో శనివారం కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

2019 జనవరి 1న తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ 4వ వారు. తొలి సీజేగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, అనంతరం జస్టిస్‌ హిమాకోహ్లీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు.

జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ బయోగ్రఫీ

జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 1961 నవంబర్‌ 30న జన్మించారు. వ్యవసాయరంగ నిపుణుడిగా పేరొందిన ఆయన తండ్రి బీఎన్‌ శర్మ భర్కతుల్లా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌గా, తల్లి శాంతిశర్మ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. జబల్‌పూర్‌లో ఇంటర్‌, సాగర్‌లోని హరిసింగ్‌గౌర్‌ యూనివర్సిటీలో బీఎస్సీ చేశారు. మూడు సబ్జెక్టుల్లో డిస్టింక్షన్‌ సాధించి, నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేయడంతోపాటు మూడు బంగారు పతకాలు సాధించారు.

1984 సెప్టెంబర్‌ 1న న్యాయవాదిగా పేరు నమోదుచేసుకొన్న ఆయన 2003లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుంచి సీనియర్‌ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏండ్ల వయస్సులోనే ఆయన ఈ హోదా సాధించడం విశేషం. 2004లో కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ప్యానల్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2008లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2010 శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జనవరి 4న కర్ణాటక న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. గత ఆగస్టు 31నుంచి కర్ణాటక హైకోర్టులో తాతాలిక సీజేగా వ్యవహరిస్తున్నారు.