AP Assembly Sessions End Today: నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు, నిన్న ఒక్కరోజే 13 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ అమోదం, శాసనమండలిలో ఆరు కీలక బిల్లులకు ఆమోదం, బ్లాక్‌లో మద్యం అమ్మితే 6 నెలలు జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా
Winter Session of Andhra Pradesh Assembly End Today | Photo Credits : PTI

Amaravathi, December 17: ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు (ap assembly winter session 2019) హీట్ పుట్టిస్తున్నాయి. నేడు 7వ రోజుకు చేరుకున్నాయి. డిసెంబర్ 9వ తేదీన మొదలైన సమావేశాలు నేటితో అంటే17 డిసెంబర్ 2019తో ముగియనున్నాయి. ఆర్టీసీ విలీన బిల్లు(RTC Merger BIll) తో పాటు ఇంగ్లీషు మీడియం బిల్లును, (English Medium bill) అలాగే దిశ బిల్లును(Disha Bill) ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టింది.

రాష్ట్రంలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, అప్రకటిత విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగుతోంది. నూతన మద్యం విధానం, రాజధాని నిర్మాణంపై అసెంబ్లీలో 6వ రోజు చర్చ జరిగింది. నిన్న అసెంబ్లీలో ఆమోదించిన 16 బిల్లులను శాసన మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ రోజు శాసనమండలిలో అమరావతి నిర్మాణంపై చర్చ కొనసాగనుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ జరగనుంది.

13 కీలక బిల్లులకు ఆమోదం

ఆరవ రోజు ఏపీ అసెంబ్లీ 13 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు, చిరుధాన్యాల బోర్డు ఏర్పాటు బిల్లు, ఏపీ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, ఏపీ రాష్ట్ర షెడ్యూల్ కులాల బిల్లు, ఏపీ షెడ్యూల్ ట్రైబల్ కమిషన్ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం లభించింది. అలాగే ఏపీ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగుల పన్ను సవరణ బిల్లు, ఏపీ అబ్కారీ 2వ సవరణ బిల్లు, మద్యనిషేధం సవరణ బిల్లు, ఏపీ వస్తువులు, సేవల పన్నుల వసరణ బిల్లులు ఆమోదం పొందాయి.

జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా..

జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని సీఎం జగన్ (AP CM YS Jagan) తెలిపారు. దాదాపు 52 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం 3 వేల 600 కోట్ల రూపాయలను ఉద్యోగుల తరపున ప్రభుత్వం భరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే.

పలు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఆమోదం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఆమోదం తెలిపింది. సభ్యుల సుదీర్ఘ చర్చల అనంతరం ఆరు బిల్లులు ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిక, వారసత్వపు బోర్డు చట్టం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- క్రిమినల్ శాసన చట్టం 2019 బిల్లు, ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- మహిళలు, బాలికలపై నిర్దేశిత అపరాధముల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానం చట్టం 2019 బిల్లు, ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థల, ఎండోమెంట్ చట్టం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య క్రమబద్ధీకరణ, పర్యవేక్షణ కమిషన్ చట్టం సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. మొత్తం 11 కీలక బిల్లులను మండలిలో ప్రవేశపెట్టగా ఆరు బిల్లులు ఆమోదం పొందాయి. మిగిలిన వాటిపై నేడు (డిసెంబర్ 17, 2019) సభలో చర్చను చేపట్టనున్నారు.

అక్రమంగా మద్యం అమ్మితే ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా

రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నాన్ బెయిలబుల్ కేసులు పెడతామన్నారు. మద్యం కాపురాల్లో చిచ్చుపెడుతుందని, మావన సంబంధాలను ధ్వంసం చేస్తుందని అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పినట్లు తెలిపారు. మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని తెలిపారు.

మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్

టీడీపీ (TDP) సభ్యులకు మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాల నిర్మించిన ఇళ్లలో ఫర్నీచర్ ని సమకూర్చామని టీడీపీ సభ్యులు అసెంబ్లీలో చెప్పటంపై మంత్రి బొత్స మండి పడ్డారు. టీడీపీ పాలకు నిర్మాణ పథకాల నిర్మించిన పేదల ఇళ్లకు ఫర్నీచర్ ని సమకూర్చామని నిరూపిస్తే ఇప్పటికిప్పుడే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని..జేబులో పెన్ను తీస్తూ..సవాల్ విసిరారు.