BJP vsTRS: నువ్వెంత నీ బతుకెంత..బండి సంజయ్పై విరుచుకుపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపాటి, మల్కాజ్ గిరి బంద్కు బీజేపీ పిలుపు, పలువురు అరెస్ట్, మైనంపల్లి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద పరిస్థితి (BJP workers attack TRS MLA Mynampally Hanumantha Rao house ) ఉద్రిక్తంగా ఉంది. బీజేపీ కార్పొరేటర్ పై నిన్న దాడి జరిగిన సంగతి సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ శ్రేణులు జరిపిన ఈ దాడుల్లో కార్పొరేటర్ తీవ్రంగా గాయపడ్డారు
Hyderabad, August 16: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద పరిస్థితి (BJP workers attack TRS MLA Mynampally Hanumantha Rao house ) ఉద్రిక్తంగా ఉంది. బీజేపీ కార్పొరేటర్ పై నిన్న దాడి జరిగిన సంగతి సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ శ్రేణులు జరిపిన ఈ దాడుల్లో కార్పొరేటర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ కార్పొరేటర్ ను ఆసుపత్రికి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, మైనంపల్లిని కబ్జాకోరుగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై మైనంపల్లి మండిపడ్డారు. మీడియా సమక్షంలోనే బండి సంజయ్ పై అభ్యంతరకర పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ మల్కాజ్ గిరి బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మైనంపల్లి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆయన (TRS MLA Mynampally Hanumantha Rao) ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేసేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు. ఆందోళనకు దిగిన మహిళా నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, పేట్ బషీరాబాద్ పీఎస్ కు తరలించారు. దీంతో అరెస్టైన మహిళలను విడుదల చేయాలంటూ బీజేపీ శ్రేణులు పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టాయి. మరోవైపు మల్కాజ్ గిరిలోని అన్ని చౌరస్తాల్లోనూ పోలీసులు బందోబస్తును పటిష్ఠం చేశారు. ఇదిలావుంచితే, నిన్నటి దాడి ఘటనలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా శ్రవణ్పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తుండగా... దాడి జరగలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్... మైనంపల్లిపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. యూస్లెస్ ఫెలో గూండాయిజం చేయడానికేనా నువ్వు ఎన్నికైందని మైనంపల్లిపై ఫైర్ అయ్యారు. గతంలో మైనంపల్లి బీజేపీలో వచ్చి చేరుతానని తన చుట్టూ తిరిగాడన్నారు. కానీ లుచ్చా రాజకీయాలు చేస్తున్నాడు... ప్రజలను ఇబ్బందిపెడుతున్నాడని పార్టీలో చేర్చుకోలేదన్నారు. ముఖ్యమంత్రి వచ్చి బతిమాలితే టీఆర్ఎస్లో చేరినట్లు చెప్పుకుంటున్నాడని అన్నారు. ఈ క్రమంలో ఆయన కొంత పరుష పదజాలంతో మైనంపల్లిపై విరుచుకుపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినా వారు చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. ఇదే పాలసీని అవలంభిస్తే తాము కూడా మొదలుపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో టీఆర్ఎస్ నాయకులు జాతీయ గీతాన్ని ఆలపించలేదని.. బాబా సాహెబ్ అంబేడ్కర్,గాంధీ ఫోటోలను అవమానించారని ఆరోపించారు.ఈ ఘటనపై డీజీపీ,కమిషనర్ స్పందించాలని డిమాండ్ చేశారు.
దీంతో మైనంపల్లి అంతకంటే రెట్టింపు పరుష పదజాలంతో బండి సంజయ్పై ఫైర్ అయ్యారు. ఇప్పటినుంచి బండి సంజయ్ భరతం పడతానని హెచ్చరించారు. దీనికి మైనంపల్లి ఘాటుగానే హెచ్చరించారు. నీకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. ఏ పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధం.నిన్ను గాడిద మీద ఎక్కించి గుండు కొట్టి తిప్పేదాకా నిద్రపోడు మైనంపల్లి. నీ చుట్టు ఉన్నవాళ్లంతా కబ్జాదారులే... నాలాల మీద ఫంక్షన్ హాల్స్ కట్టారు.
రేపటి నుంచి అక్రమంగా నిర్మించిన గోదాములు,ఫంక్షన్ హాళ్ల ఎదుట ధర్నా చేస్తా. వాటిని కూలగొట్టేదాకా వదలను. ఒకసారి ఎమ్మెల్సీ,నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.నేనెప్పుడూ ఇంతలా మాట్లాడలే... నన్ను రెచ్చిగొట్టినవ్... మొత్తం జిల్లాలు కదలి వస్తాయ్...' అని మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో బీజేపీ కార్పోరేటర్ శ్రవణే గాంధీ బొమ్మను పగలగొట్టి రాద్దాంతం చేశాడని ఆరోపించారు. అతనో సైకో అని విమర్శించిన మైనంపల్లి... ఇంతకుముందు చాలామందిని కొట్టాడని ఆరోపించారు. బండి సంజయ్కి దమ్ముంటే తన ముందుకొచ్చి ఆరోపణలు చేయాలని సవాల్ విసిరారు.
నీది కార్పోరేటర్ స్థాయి.. కార్పోరేటర్లపై కూడా నాకు గౌరవం ఉంటుంది... నీకు బీజేపీ స్టేట్ ప్రెసిడ్ంట్ ఇచ్చారు... అది ప్రూవ్ చేసుకో... ఇక్కడికొచ్చి ఎన్విరాన్మెంట్ మొత్తం స్పాయిల్ చేశావు. మల్కాజ్గిరిలో ప్రశాంతత ఉండాలనేది మైనంపల్లి ఆకాంక్ష. ఎప్పుడైనా అద్దంలో నీ ముఖం చూసుకున్నావా... నువ్వొక వుమెనైజర్... నీ అరాచకాలన్నీ బయటపెడుతా... అసలు కామన్ సెన్స్ ఉందా నీకు.. గుండు పగలగొట్టేస్తా... నేను పిలిస్తే జిల్లాల నుంచి లక్షల మంది తరలిస్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు టీఆర్ఎస్,బీజేపీ కొట్టుకుంటే కాంప్రమైజ్ చేశా... నువ్వెంత నీ బతుకెంత... బచ్చాగానివి... నీవన్నీ బయటకు తీస్తా. నేను కష్టపడి పైకొచ్చా... నాదేంది నువ్వు బయటపెట్టేది... దేనికంటే దానికి సిద్ధం. వరదల సహాయక చర్యల్లో తిరిగినప్పుడు నువ్వెక్కడున్నావ్. దమ్ముంటే రా... ఏ చౌరస్తాకు రమ్మంటే అక్కడికి వస్తా....' అని మైనంపల్లి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
నీ దగ్గరికి నేనొచ్చానా... నాకు కులం,మతం ఫీలింగ్ లేదు... నన్ను రెచ్చగొట్టారు కాబట్టి నిన్ను నిద్రపోనివ్వను. నువ్వు ఎంపీగా ఓడిపోయేదాకా నీ వెనుక పడుతా. ఒకసారి ఎంపీగా గెలిచినందుకే అంత రెచ్చిపోతే... నేనెంత రెచ్చిపోవాలి. రా.. మైనంపల్లి అంటే ఏందో చూపిస్తా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చావని కార్పోరేటర్లే నాతో చెప్పారు.సత్తా ఉంటే రా... ఎక్కడికి అంటే అక్కడికి వస్తా.. నేనూ,నా కార్యకర్తలు చాలు నీకు.' అని మైనంపల్లి హనుమంతరావు తీవ్ర స్థాయిలో విమర్శలు,ఆరోపణలు చేశారు.
మల్కాజ్గిరిలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక టీఆర్ఎస్,బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. అయితే జాతీయ జెండాలో భరతమాత ఫోటో ఉండటంపై వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా అది ఘర్షణకు దారితీసింది. టీఆర్ఎస్ కార్యకర్తలు బీరు బాటిళ్లతో దాడి చేశారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన కార్పోరేటర్ శ్రవణ్ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఆస్పత్రికి వెళ్లి శ్రవణ్ను పరామర్శించడం... మైనంపల్లిపై విరుచుకుపడటం జరిగాయి. దీనికి మైనంపల్లి మరింత తీవ్రంగా రెచ్చిపోయి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బంద్ నేపథ్యంలో మల్కాజ్గిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షాపులను తెరవకుండా అడ్డుకుంటున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠిచార్జ్ చేశారు. మల్కాజ్గిరి వినాయక నగర్ చౌరస్తా వద్ద బీజేపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం.. తోపులాట చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెంటనే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 16, 2021 03:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

