e-RUPI: ఈ-రూపీ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, ఈ-రుపీ ఓచర్లను ఇతర పనులకు వాడుకోవచ్చా, ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఈ-రూపీ ప్రయోజనాలు, దానిపై పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకోండి
దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ లావాదేవీలను మరింతగా ప్రోత్సాహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ-రూపీ((E-RUPI))ని వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. భారత్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను (Digital payment solution) విస్తృతం చేయడమే కాక, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు.
New Delhi, August 3: దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ లావాదేవీలను మరింతగా ప్రోత్సాహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ-రూపీ((E-RUPI))ని వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. భారత్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను (Digital payment solution) విస్తృతం చేయడమే కాక, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ-రుపీతో చెల్లింపు విధానాన్ని మొదట ఆరోగ్య సేవల్లో వినియోగించనున్నారు. తర్వాత మిగతా రంగాలకు విస్తరిస్తారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు లబ్ధిదారుడికి చేరడానికి మధ్యలో ఉన్న అంచెలను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎన్నో సంస్కరణలను అమలు చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం డబ్బులను నేరుగా బ్యాంకుల ఖాతాల్లో జమచేస్తున్నారు. ఇలా నగదు బదిలీ చేయడం ద్వారా నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలిగించగలిగామని, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1.78 లక్షల కోట్లు ఆదా అయిందని ప్రధాని (Prime Minister Narendra Modi) తెలిపారు.
గ్యాస్ సబ్సిడీ, ఎరువులపై రాయితీ, పీఎం కిసాన్ ఇలా దాదాపు 300 కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా సుమారు 90 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారన్నారు. వీరి ఖాతాల్లో ఇప్పటివరకు రూ.17.5 లక్షల కోట్లు జమ చేసినట్టు చెప్పారు. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లి నగదు అవసరం లేకుండా చెల్లింపులు చేసేందుకు ఈ-రుపీ వ్యవస్థను తీసుకువచ్చినట్టు చెప్పారు.
డిజిటల్ చెల్లింపులు సులభతరం చేసేందుకు వచ్చిన ఈ-రూపీ వినియోగం సేఫ్, సెక్యూర్ ఆధారంగా ఉండనుంది. ఈ-రూపీ విధానంలో వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉంటాయి. క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ స్ట్రింగ్ ఓచర్లను లబ్ధిదారుడికి పంపడం ద్వారా చెల్లింపులు జరుగుతాయి. బ్యాంక్ ఖాతాలు, కార్డులు, యాప్లతో సంబంధం లేకుండా వినియోగదారుడు లావాదేవీలు జరుపవచ్చు. దీనిలో మరో ప్రయోజనం ఏంటంటే కార్డు, పేమెంట్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం 8 బ్యాంకుల ద్వారా ఈ-రూపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ-రుపీ అనేది ఒక ప్రీపెయిడ్ గిఫ్ట్ వోచర్/కూపన్ లాంటిది. క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో ఉంటుంది. ఎలాంటి కార్డులు, పేమెంట్ యాప్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేకున్నా దీనితో చెల్లింపులు చేయవచ్చు. వీటిని బ్యాంకులు జారీచేస్తాయి. ప్రస్తుతం ఎనిమిది బ్యాంకులు ఈ వోచర్లను జారీచేయనున్నాయి.ఈ-రుపీతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. ఈ వోచర్లను ప్రభుత్వాలే కాకుండా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా జారీచేయవచ్చు.
ఈ-రుపీతో చెల్లింపు చేయాలనుకొనేవారు ముందుగా బ్యాంకుకు వెళ్లాలి. ఎవరికి, ఎందుకు పంపుతున్నారో కారణాలు తెలుపాలి. పంపాల్సిన మొత్తంలో బ్యాంకు ఈ-రుపీ వోచర్ను జారీచేస్తుంది. లబ్ధిదారుడి ఫోన్ నంబర్కు ఈ వోచర్ క్యూర్ కోడ్/ఎస్ఎంఎస్ వెళ్తుంది. దీని ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అయితే ఇక్కడ.. ఈ-రుపీ ఏ ఉద్దేశంతో అయితే పంపారో దానికే వాడాల్సి ఉంటుంది.
కొన్ని ఉదాహరణలు
ఉదాహరణకు ఒక విద్యార్థికి ఏదైనా కాలేజీలో చదవడానికి స్కాలర్ షిప్ జారీచేస్తే ఆ డబ్బును నేరుగా బ్యాంకులో జమ చేయకుండా అంతే మొత్తంలో ఈ-రుపీ వోచర్ను జారీచేస్తే దానిని ఆ కాలేజీలోనే చెల్లించాలి అంతే తప్ప ఆ వోచర్ను వేరే అవసరాల కోసం వాడుకోవడానికి కుదరదు. అదే విధంగా రైతులకు ఎరువులపై రాయితీతో కూడిన వోచర్ జారీచేస్తే అది కేవలం ఎరువుల షాపుల్లోనే చెల్లుబాటు అవుతుంది. ఆ డబ్బును ఇతర వ్యాపారాల్లో అలాగే వేరే చోట్ల వినియోగించలేం.
(The above story first appeared on LatestLY on Aug 03, 2021 03:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

