
Hyderabad, June12: ఈ నెల 19 తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు (surprise visits to panchayats municipalities after June 19)చేసి పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పట్టణ ప్రగతి అమలుపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముందస్తు ప్రణాళిక సంస్కృతిని అన్ని శాఖల యంత్రాంగం అభివృద్ధి చేయాలని.. ఇందులో భాగంగా సీజనల్ వ్యాధుల కట్టడికి అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం (CM K Chandrashekar Rao) ఆదేశించారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందన్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 13న జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలు (Palle Pragathi and Pattana Pragathi) సత్ఫలితాలుస్తున్నా ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు. నిర్దేశిత బాధ్యతలను నిర్వర్తించడంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, అధికారులు ఎందుకు విఫలమవుతున్నారో తెలుసుకోవాల్సి ఉందన్నారు. పల్లె/పట్టణ ప్రగతి అమలుపై శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ‘పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను నిత్యం కొనసాగించాలి.
ఈ విషయంలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉద్యోగులు అలసత్వానికి తావివ్వకూడదు. మీకు పూర్తి సమయమివ్వాలనే నేను ఇన్ని రోజులు పర్యటన చేపట్టలేదు. రెండేళ్లు గడిచిపోయాయి. ఇక నేను రంగంలోకి దిగక తప్పదు. తాత్సారం, అలసత్వం, నిర్లక్ష్యం వహించినట్లు నా పర్యటనలో గుర్తిస్తే ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదు... క్షమించేదీ లేదు. కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
అదనపు కలెక్టర్లు ఆశించిన రీతిలో సామర్థ్యాన్ని నిరూపించుకోవట్లేదు. వారి నుంచి చాలా ఆశించామని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లెలు, పట్టణాలను బాగు చేయడానికి నియమించిన అదనపు కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉండాలని ఆదేశించారు. డీపీవోలు, కింది స్థాయి ఉద్యోగులను ఆ దిశగా ఉత్సాహపరుస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షించేందుకు 13న అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారు (డీపీవో)లతో ప్రగతి భవన్లో భేటీ కానున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందన్నారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత మరో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిపై వేర్వేరు చార్టులను రూపొందించాలని సీఎస్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, మంచినీటి సరఫరా, బతికిన మొక్కల శాతం, గ్రామ సభల నిర్వహణ, స్థానిక ఎంపీవోల హాజరు, అందులో వారు గ్రామ ప్రగతికి తీసుకున్న చర్యలు, ఎన్నిసార్లు గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ ప్రగతి నివేదికలపై జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలను చార్టుల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పురపాలక శాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్లు ఇకపై పట్టణాలు, గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రగతి తీరును పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డీపీవోలు కూడా పల్లె పర్యటనలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
గ్రామాల్లో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు సీజన్లవారీగా తీసుకోవాల్సిన చర్యలతో చార్ట్ తయారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ‘వానాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు, చలికాలంలో స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు, ఎండాకాలంలో డయేరియా వంటి వ్యాధులు వస్తుంటయి. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులను అరికట్టడం చాలా కీలకం. ఇందుకు పంచాయితీరాజ్, మున్సిపల్, వైద్యశాఖలు సమన్వయంతో పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. వానాకాలం నేపథ్యంలో తాగునీటి సరఫరా ట్యాంకులను శుద్ధి చేయాలని సూచించారు.
పల్లెలు, మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే–అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నట్టు తనకు సమాచారం వుందని, వాటిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీల బడ్జెట్ రూపకల్పనలో కలెక్టర్లు భాగస్వాములు కావాలని కోరామని, ఏ మేరకు అవుతున్నారని ఆరా తీశారు.