Telangana: కేంద్రం ప్రతీదానిలో వేలు పెడుతోంది, రోజువారీ కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి పంపడం ఏంటీ, మరోసారి కేంద్రంపై విమర్శనాస్త్రాలను సంధించిన తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR Meeting (Photo-TS CMO)

Hyd, May 19: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సమరశంఖం మోగించిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా బీజేపీపై ఆయన విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన మరోసారి కేంద్రంపై విమర్శనాస్త్రాలను సంధించారు. విద్య, వైద్యం వంటి కీలక రంగాలను పట్టించుకోకుండా... రాష్ట్రానికి సంబంధించిన ప్రతి పనిలో కేంద్రం వేలుపెడుతోందని (spits fire at Centre for undermining states) మండిపడ్డారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా ఆయన (Telangana CM K Chandrasekhar Rao) ఈ వ్యాఖ్యలు చేశారు.

పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చాక.. నాటి రాజీవ్‌గాంధీ నుంచి నేటి మోదీ వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రం నుంచే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారంగా ఉంది. జవహర్‌ రోజ్‌గార్‌ యోజన, ప్రధాని గ్రామసడక్‌ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సరికాదు. స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి. ఏం అవసరం, ఏమేం చేయాలన్నది తెలుస్తుంది.

సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ నటుడు విజయ్‌, ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్టుగా వార్తలు

కానీ రోజువారీ కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం ఏమిటి?..’’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. 75 ఏళ్ల ఆజాదీకి అమృత్‌ మహోత్సవాలు జరుపుకొంటున్న సమయంలో కూడా.. దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయని, తాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారని.. కేంద్రం తీరే దీనికి కారణమని విమర్శించారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో కూడా రావాల్సినంత ప్రగతి రాలేదని.. కేంద్రం వీటిపై దృష్టి పెట్టకుండా రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హయాం నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు కేంద్ర ప్రభుత్వాలు చాలా చీప్ గా వ్యవహరిస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూడు దశల పంచాయతీ రాజ్ వ్యవస్థ అత్యంత కీలకమని... కానీ, తొలి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలను నమ్మకుండా నేరుగా గ్రామాలకు నిధులను పంపిణీ చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

జవహర్ రోజ్ గార్ యోజన, పీఎం గ్రామ్ సడక్ యోజన, ఉపాధి హామీ పథకం వంటి కార్యక్రమాలకు గాను స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను పంపించడం సరైనది కాదని కేసీఆర్ అన్నారు. స్థానిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే స్పష్టమైన అవగాహన ఉంటుందని చెప్పారు. రోజువారీ కూలీలకు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వాలు నేరుగా డబ్బును పంపిణీ చేయడం సరైన చర్య కాదని అన్నారు. ఇప్పటికీ ఎన్నో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు విద్యుత్ లేక అల్లాడుతున్నాయని, ప్రజలు చీకట్లలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంచనాల మేరకు మన దేశంలో విద్య, ఉద్యోగాల కల్పనలో పెరుగుదల నమోదు కాలేదని కేసీఆర్ విమర్శించారు. ఇలాంటి కీలకమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం మానేసి.. రాష్ట్రాలకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మన దేశం పురోగతి దిశగా అడుగులు వేయడం లేదని అన్నారు.

తెలంగాణ రైతులు పండించిన మొత్తం వరిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ చెప్పారు. 56 లక్షల టన్నుల వరిలో ఇప్పటికే 20 లక్షల టన్నులను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పటికీ... ఆ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. వర్షాల కారణంగా రైతులు పండించిన ధాన్యం తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

భవిష్యత్ తరాల మానసిక ఆరోగ్యం, శారీరక దృఢత్వం కోసం గ్రామాలలో స్పోర్ట్స్ సెంటర్లను నిర్మించాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 24 వేల గ్రామాల్లో క్రీడా కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొన్ని స్పోర్ట్స్ సెంటర్లను రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభిస్తామని తెలిపారు.

ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వేసవి నేపథ్యంలో జూన్‌ 3 నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పల్లె ప్రగతిలో ఎంపీపీలు, ఎంపీడీవోల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. 100 శాతం బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) గ్రామాల సాధనకు చర్యలు తీసుకోవాలని, వైకుంఠ ధామాల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలకు విశేష గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో తొలిదశలో పదికి పది గ్రామాలు, రెండో దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ శాఖను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సీఎం అభినందించారు.